జగన్కు సొంత జిల్లాలో బిగ్ షాక్...!
జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలోని ఓబన్నపేట, సుగుమంచిపల్లె-1, సుగుమంచిపల్లె-2, సుగుమంచిపల్లె గ్రామ సర్పంచితో పాటు 14 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇవన్నీ కూడా గండికోట జలాశయం ముంపు పరివాహకంలో ఉండే ప్రాంతాలు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు పెట్టాలనుకుంటున్నా కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
తమకు ఇష్టం లేకపోయినా కూడా తమ పంచాయతీ లను ప్రభుత్వం విలీనం చేసిందన్న కోపం వారిలో ఉంది. సీఎం జగన్ సొంత జిల్లా లోనే ఈ విధమైన నిరసన రావడం విచిత్రమే అనుకోవాలి. నిన్న ఐదు గంటలకు నామినేషన్ల తుది గడువు.. అయినా కూడా ఏ ఒక్కరు ఇక్కడ నామినేషన్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. గతంలో ఓ సారి ఈ గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. అయినా ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్న ఆవేదన ఇక్కడ ప్రజల్లో ఉంది.
ఇక ఇప్పుడు మరోసారి నామినేషన్లు వేయక పోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం చోద్యం చూడడం తప్పా చేసేదేం లేకుండా పోయింది. ఏదేమైనా జగన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చాలా నిర్ణయాలు తీసుకుంటుందన్న టాక్ ఉంది. అలా జరిగితే ఏమవుతుందో ఇప్పుడు ఆయ న సొంత జిల్లా ప్రజలే ఆయనకు చెప్పకనే చెప్పారు.