విశాఖ మన్యంలో మావోల అలజడి! జగనన్నకు వార్నింగ్ !
గంజాయి సాగు, రవాణ అన్నవి విపరీతంగా పెరిగిపోతున్న విశాఖ మన్యంపై ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. టీడీపీ కూడా గంజాయికి సంబంధించే అనుచిత వ్యాఖ్యలు చేస్తోంది. గంజాయి రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత వైసీపీదేనని, లేదంటే తాము మరింత ఉద్యమిస్తామని టీడీపీ చెబుతోంది. మొన్నటి వేళ టీడీపీ నాయకులు పఠాభి కూడా మాట్లాడింది గంజాయి రవాణా పైనే! ఈ నేపథ్యంలో గంజాయి సాగు వద్దనే అనుకుంటున్నారు గిరిజనులు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న గంజాయిపై కూడా నిఘా ఉంది కనుక అంత వేగంగా ఇవి సరిహద్దులు దాట లేవు అన్న భయం కూడా వ్యాపారులకు ఉంది. డీజీపీ మొదలకుని విశాఖ పోలీసు వరకూ అంతా గంజాయి సాగును అడ్డుకోవడంపైనే దృష్టి నిలిపారు. దీంతో ఏ చిన్న సమాచారం వచ్చినా అందించాలని స్థానికులను సైతం అడుగుతున్నారు.
గత కొద్ది కాలంగా ఎటువంటి రెచ్చగొట్టే ఘటనలూ లేవు. పోలీసు ఇన్ఫార్మర్ల పేరిట హత్యలూ లేవు. చాలా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో అలజడి రేగింది. మావోల పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఇవి సంచలనాలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజా సాగును ఎక్కడిక్కడ నియంత్రిస్తున్న ప్రభుత్వానికి ఇదొక ఆశాభంగమే! విశాఖ జిల్లా, జి.మాడుగుల మండ లం,బొయితిలి పంచాయతీ, మద్దిగరువులో మావోయిస్టుల పోస్టర్లు స్థానికంగా కలకలం రేపాయి. గత కొద్ది కాలంగా మావోయిస్టుల ఉనికే లేదని భావిస్తున్న పోలీసులకు ఈ పరిణామం ఉత్కంఠతను రేపుతోంది. మావోయిస్టుల అగ్రనేత ఆర్కే మరణానంతరం మెత్తబడ్డ దళాలు ఒక్కసారిగా పోస్టర్లను అంటించి రాష్ట్ర ప్రభుత్వంపై తమ తిరుగుబాటును ప్రదర్శించారు.