కుప్పం : చివరికి మిగిలిందేంటి బాబూ!
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ మున్సిపాల్టీ ఎన్నికకు ఇంతటి క్రేజ్ రావడం ఇదే మొదటిసారి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి చిన్న ఎన్నికనూ పట్టించుకుంటోంది. గెలిచేందుకు అవకాశం ఉన్న స్థానాలనూ ప్రచారం చేయకుండా అస్సలు వదలడం లేదు. బద్వేలు విషయమై ఇదే జరిగింది. ఇప్పుడు కూడా కుప్పంలో చంద్రబాబు మనుషులను నిలువరించేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని నిలువరించేందుకు జగన్ చేసిన లేదా చేయించిన పనులన్నీ సఫలీకృతం అయ్యాయి. ఫలితంగా కుప్పంలో ఓటర్ల మనోగతం ఎలా ఉన్నా కూడా గెలిచేది మాత్రం ఇక్కడ వైసీపీనే! తాము ఇక్కడ గెలవకపోతే కుప్పం అభివృద్ధే ఆగిపోతుంది అన్న రేంజ్ లో వైసీపీ ప్రకటనలు ఉన్నాయి. కానీ ఏ పని చేపట్టాలన్నా సరిపడినంత నిధులు కదా కావాల్సింది. మరి! నిధులకు సంబంధించి రేపటి వేళ ఏం మాట్లాడుతారో?
ఇక టీడీపీ విషయానికి వస్తే అధికారంలో ఉన్నంత కాలం బాబు పెద్దగా తన సొంత నియోజకవర్గంను పట్టించుకోలేదు అన్న అప వాదు ఉంది. ఆయనకు ఎంత సేపు అమరావతి అభివృద్ధే తప్ప కుప్పం పై ఆలోచనే లేదని విమర్శ కూడా ఉంది. ఇదే దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఇటుగా వచ్చిన దాఖలాలూ లేవు. అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో బాబును గెలిపించారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రాగానే కుప్పం అనే కాదు సీమ మొత్తం తన మనుషుల గెలుపే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కొందరు టీడీపీ లీడర్లు అధికార పార్టీపై తిరుగుబాటు చేసినా కూడా అవేవీ ఫలించలేదు. ఇప్పుడిక్కడ ఎంచక్కా రిగ్గింగ్ జరుగుతుందన్న వాదన ఉంది. అయినా కూడా! తాము శక్తి వంచన లేకుండా పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నామని అంటున్నారు చంద్రబాబు.