ప్రతి పక్షంలో ఉన్న పార్టీ గెలిచి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో అనేక వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అధికార పార్టీ పై ఆరోపణలు గుప్పిస్తూ.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతు.. వ్యతిరేకత పెంచి.. తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఇలాంటి పాచికలు పారనప్పుడు సానుభూతి అనే ఆయుధాన్ని ఎక్కువగా రాజకీయ నాయకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాంటి బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
దీనికి కారణం అసెంబ్లీ సమావేశంలో నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడమే. ఇన్నాళ్లు.. రాజకీయంగా వైసీపీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ విఫలమయిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సైకిల్ పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఇన్నాళ్లు పెద్దగా ఓటమిని పట్టించుకోని చంద్రబాబు.. తన దాకా వస్తే గానీ తెలియదు అన్న రీతిలో.. కుప్పం మున్సిపల్ ఫలితాల అనంతరం చంద్రబాబు కొత్త పంథాను ఎంచుకున్నట్టు కనబడుతోంది. తన సొంత నియోజవర్గంలో పార్టీ ఓటమిపాలు కావడంతో బాబుగారు డిఫెన్స్లో పడ్డారు.
పైగా అధికార పక్షం నేతల మాటల తూటాలు గట్టిగా గుచ్చుకున్నట్టున్నాయి. ఇవన్నీ వెరసీ కన్నీళ్ల రూపంలో జాలువారాయని తెలుస్తోంది. అయితే, కుప్పం ఓటమి చివరిది కావాలని ఇక ముందు గెలుపే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని స్పస్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే అసంబ్లీ సమావేశాలు మొదలయిన రెండో రోజే సభనుంచి బయటకు వచ్చి ఏడుస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంఘటనతో రాష్ట్రం చూపు మొత్తం తన వైపు తిప్పుకున్నారు చంద్రబాబు. ఇదే నాందిగా వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి బాబు ఏడుపు గెలుపునకు దారితీస్తుందా..? ఏమవుతుంది అనేది చూడాలలి.