2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల నిర్వహణ పై కాగ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లో రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కాగ్ నివేదికలోని అంశాలు.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి... తరువాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారు.. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దం అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగాయంటూ, చట్ట సభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీనపరిచారు అని కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజా వనరుల వినియోగ నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారని, శాసన సభ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునరావృతం అవుతున్నాయి అని పేర్కొంది. అదనపు నిధులు ఆవశ్యకం అని భావిస్తే... శాసన సభ నుంచి ముందస్తు ఆమోదం పొందేలా చూసుకోవాలి అని సూచించింది.
2018 -19 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గినట్టు వివరించింది. కొత్త సంక్షేమ పథకాల వల్ల 6.93 శాతం రెవెన్యూ ఖర్చులు పెరిగాయి. 2018-19 నాటి రెవెన్యూ లోటు ను మించి 2019-20 కి 90.24 శాతం మేర పెరిగిన రెవెన్యూ లోటు ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. 2018-19 నాటితో పొల్చితే 2019-20 నాటికి 32,373 కోట్ల మేర బకాయిల చెల్లింపులు పెరిగినట్టు కాగ్ నివేదికలో వెల్లడించింది. చెల్లించాల్సిన బకాయిల వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదు కాగ్ నివేదికలో పేర్కొంది. శానస వ్యవస్థను నీరు గార్చేలా... నిధుల నిర్వహణ ఉందని కాగ్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభత్వంపై అసహనం వ్యక్తం చేసింది.