ఆంధ్రావని వాకిట కొత్త వివాదం ఒకటి తెరపైకి రానుంది. అదేంటంటే కొత్త జిల్లాల పేరిట రాజకీయం నడిపేందుకు అంతా సిద్ధం అయిపోతున్నారు. 13 జిల్లాలను రెట్టింపు చేస్తే బాగుంటుంది అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా అందుకు తగ్గ వీలు జగన్ కు దక్కలేదు అని చెప్పడం సబబు. ఆ విధంగా ఆగిపోయిన ప్రక్రియ జన గణన పూర్తయ్యాక పూర్తి రూపు తీసుకోనుందని టాక్. పొలిటికల్ టాక్ లేండి. పబ్లిక్ టాక్ అవునో కాదో తెలియదు. ఈ నేపథ్యంలో ఇష్యూ డైవర్షన్ ఏమనగా వరుస వైఫల్యతలతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీకి కొత్త వివాదం హాయిగా కొంత ఉపశమనం ఇవ్వనుందని! టాక్ .. టీడీపీ టాక్..
ఇష్యూ డైవర్షన్ పాలిటిక్స్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఆలోచిస్తే మన నాయకులు ఎప్పటికప్పుడు అప్ డేట్ అయి ఉంటారు. లేదంటే మహా చెడ్డ కోపం వాళ్లకు వచ్చేస్తది. తప్పేం లేదు ఒక ఇష్యూ నుంచి మరో ఇష్యూకు పోవడంలో తప్పేమీ లేదు. దాని వల్ల సమాజం ఏమీ మారిపోదు. ఇప్పటి కష్టాలు తీరిపోవు. నిన్నటి కష్టాలు రేపటి వరకూ ఉండక తప్పవు. అయినా కూడా మన నాయకులు తమదైన శైలిలో మమేకం అవుతూ పని చేస్తూ ఉంటారు. అలా పనిచేయడంలో ఆనందం వెతుక్కుంటారు. కొన్నిసార్లు దుఃఖం తన్నుకు వస్తున్నా అదుపులో ఉంచుకుంటుంటారు. ఆ విధంగా పనిచేయడంలో లాజిక్ ఉంది. అందుకే చంద్రబాబు కానీ జగన్ కానీ మంచి మంచి ఎత్తుగడలనే ఎంచుకుంటారు. లేదంటే వాళ్లిద్దరూ జనం ఎదుట చులకన అయిపోతారు. కనుక మన దేశంలో ఇష్యూ డైవర్షన్ పాలిటిక్స్ ను బాగానే నడిపించే సత్తా చాలా మందికి ఉంది.
జగన్ కు మరియు చంద్రబాబుకు జనం ఎదుటే తగువు కానీ లోలోపల మాత్రం వైరం ఉంటుందని అనుకోలేం. ఉంటే గింటే చంద్రబాబు బినామీలపై జగన్, జగన్ బినామీలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వారు కక్ష గట్టి లోపలేయెచ్చు. కానీ అలా చేయరు. జస్ట్ బయటకు తిట్టుకుని ఒకరి పనులు ఒకరు హాయిగా చేయించుకుంటారు. అందుకే టీడీపీ హయాంలో ధర్మాన (మాజీ రెవెన్యూ మంత్రి) మాట అంతగా చెల్లింది. కాదు చెల్లించింది అప్పటి గవర్నమెంటు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ సర్కారులోనూ టీడీపీ ఏజెంట్లు ఉంటారు. వాళ్లే అన్ని పనులూ చక్కదిద్ది బాబుగారికి సాయం చేస్తూ వస్తుంటారు. ఇవన్నీ గమ్మత్తైనవి అయి ఉంటాయి. లేదా గమ్మత్తులో భాగం అయి ఉంటాయి. ఇప్పుడు రాజకీయం కొత్త జిల్లాల చుట్టూ తిరుగుతుంది కనుక ఈ గమ్మత్తు ఎందాక ఉంటుందో అన్నది ఓ ఆసక్తిదాయకం.