రైతుల దగ్గర ధాన్యం తీసుకునేది లేదన్న మంత్రి...!
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు వరి పంటకే భూములు సారవంతంగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రత్యామ్నాయ పంటలు సాధ్యమేలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రత్యామ్నాయంగా ఏ పంట సాగు చేయాలనే విషయంపై కూడా ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంట సాధ్యమేనా అనేది రైతుల మదిలో ఉన్న పెద్ద ప్రశ్న. చివరి నిమిషంలో రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఇప్పటి నుంచే తెలంగాణ సర్కార్ జాగ్రత్త పడుతోంది. అందుకే యాసంగి పంట కొనుగోలుపై ఇప్పటికే మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ప్రస్తుత పరిస్థితికి కారణం తాము కాదనే విషయాన్ని కూడా మంత్రి నిరంజన్ రెడ్డి పదే పదే వెల్లడించారు. యాసంగి పంట ధాన్యం సేకరణకు కేంద్రమే విముఖత చూపుతోందని... ఇందుకు ప్రధానంగా కాంగ్రెస్, భారతీయ జనతా పారీలదే బాధ్యత అని అన్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణపై కేంద్రంతో కేసీఆర్ స్వయంగా చర్చలు జరిపారని... కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఏ మాత్రం అంగీకరించలేదన్నారు. దీంతో రైతులు తప్పని పరిస్థితుల్లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు.