విశాఖ కేంద్రంగా జరుగుతున్న భూ ఆక్రమణలకు సంబంధించి చాలా ఆరోపణలు అధికార పార్టీ పై ఉన్నాయి. అదేవిధంగా ఆస్తులు తనఖా పెట్టి మరి! ప్రభుత్వాన్ని నడుపుతున్న వైనంపై కూడా చాలా అంటే చాలా ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కాక అనాలోచిత నిర్ణయాలు కొన్ని ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు అవినీతి, అక్రమార్జనలపై అయ్యన్న కొన్నివివరాలు ఇచ్చారు ఓ ఇంటర్వ్యూలో... ఆ వివరాలివి
ఆంధ్రజ్యోతి ఛానెల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరిట ప్రసారం అయ్యే కార్యక్రమానికి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యన్నఅనేక విషయాలు చెప్పారు. ప్రభుత్వం నడుచుకుంటున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అరవై ఏళ్లు దాటిన తనకు ఇక రాజకీయంపై పెద్దగా ఆసక్తిలేదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయం అని చెబుతూ పదవుల పై కూడా తనకు పెద్దగా నమ్మకం లేదని కూడా చెప్పేశారు. ఇదే సందర్భంలో వైసీపీ సర్కారు అన్యాయాలు అక్రమాలు గురించి చెబుతూ చాలా విషయాలు వివరించారు.
వైజాగ్ కేంద్రంగా పూర్తిగా కబ్జాలు నడుస్తున్నాయని చెబుతూ తన సొంత అనుభవాలు చెప్పారు. సాయి రెడ్డి తనకు చెందిన ఓ రిసార్ట్ పై కన్నేశారని, తనతో పాటు మరో ముగ్గురు పార్టనర్లుగా ఉన్న ఆ రిసార్టు నిర్వాహకులను బెదిరించారని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపాన సన్ రే రిసార్టు పేరిట తాను ఇంకొందరు రూపొందించిన ఈ రిసార్టును లాక్కోవాలని చూశారని అభియోగాలు చేశారు. ఇదే కాదు విశాఖలో ఇవాళ చాలా సహజ వనరులు దోపీడికి గురి అవుతున్నాయని అన్నారు.
ఇదే వీడియోలో విజయ్ కూడా వైసీపీ ప్రభుత్వం తీరుపై ముఖ్యంగా ఎన్నికల ముందు తనను సంప్రదించిన వైనంపై మాట్లాడారు. తమ కుటుంబంలో చీలికలు తెచ్చారని అయినా కూడా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన కుటుంబం నుంచి ఇద్దరిని బరిలో నిలిపి గెలిపించామని చెప్పారు. కుటుంబంలోనే కాదు రాష్ట్రంలోనూ అతలాకులమయిన పరిస్థితులు సృష్టించి పబ్బం గడుపుకుం టున్నారని అన్నారు. ఇప్పటికే చాలా భూములు స్వాహా అయి పోయాయని ఆరోపించారు. కేసులున్నా తాము భయపడబోమని కూడా స్పష్టం చేశారు.