ఓటీఎస్ కి డబ్బులు కట్టకపోతే పథకాలు కట్..? మంత్రి ఏమన్నారంటే..?
మొత్తమ్మీద ఓటీఎస్ వ్యవహారం మంత్రులకు తలనొప్పిగా మారింది. ఎక్కడ ఎవరు ఏ పర్యటనకు వెళ్లినా కూడా ఇదే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓటీఎస్ స్వచ్ఛందమా..? కాదా..? ఓటీఎస్ కి అర్హులైనవారు డబ్బులు కట్టకపోతే పథకాలు నిలిపివేస్తారట నిజమేనా? అని అడుగుతున్నారు. దీంతో మంత్రులు పదే పదే సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది.
తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఓటీఎస్ లబ్ధిదారులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, అది పూర్తిగా స్వచ్ఛందం అని మంత్రి అవంతి స్పష్టం చేశారు. అంతే కాదు, ప్రతిపక్షాలపై ఆయన దుమ్మెత్తిపోశారు. సంక్షేమ పథకాలపై అక్కసుతో ప్రతిపక్షం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. పథకాలు ఆపే ప్రసక్తే లేదని, ఓటీఎస్ పూర్తిగా లబ్ధిదారుల అనుమతితో జరిగే ప్రక్రియ అని చెప్పారాయన.
మరోవైపు అధికారులు మాత్రం ఇలా స్వచ్ఛందం అనే ప్రకటన జనాల్లోకి బాగా వెళ్తే.. డబ్బులు కట్టేవారు ఎవరూ ఉండరని, ఎంత అవగాహన కల్పించినా.. ఇప్పటికిప్పుడు 10వేల రూపాయలు తీసుకొచ్చి ఓటీఎస్ కి జమచేయడానికి ఎవరూ సిద్ధంగా లేరని అంటున్నారు. దీంతో చాలా చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ సానుభూతిపరులు మాత్రమే ఓటీఎస్ కోసం ముందుకొస్తున్నారు. పేదలు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో ఓటీఎస్ కి మొగ్గు చూపడంలేదు.