చంద్రబాబు సొంత జిల్లాలో మూడు రాజధానులకు మద్దతా... బాబుకు పెద్ద ఇబ్బందేనా ?
అయితే ఇప్పటి వరకు పెద్దగా ఇబ్బందులు లేకుండా సాగిపోయినా మహాపాదయాత్ర .. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే సరకి మాత్రం ఇక్కడ పెద్ద ఇబ్బందే ఎదురవుతుండడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు అనుకూలంగా.. ఇక్కడి ప్రజలు కదం తొక్కుతున్నారు. చిత్తూరు సరిహద్దుల్లోని ప్రజలు రోడ్ల మీదకు వచ్చి.. ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానులు కావాలంటూ.. వారు ఆందోళనకు దిగారు.
వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని ముందుగానే అందరూ ఊహించారు. ఎందుకంటే.. చిత్తూరుకు సమీపంలోని కర్నూలును న్యాయ రాజధాని చేయడం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వర్గం ప్రజలు.. మూడు రాజధానులకు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించారు. కొందరు అడుగులు కూడా కదిపారు.
అయితే.. ఇది అధికార పార్టీకన్నా కూడా.. టీడీపీకే ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ఎందుకంటే.. అమరా వతి ఉద్యమం సహా ప్రస్తుతం సాగుతున్న పాదయాత్ర వెనుక కూడా టీడీపీ నాయకులు ఉన్నారు. ఎక్కడి కక్కడ పాదయాత్రకు బ్రహ్మ రథం కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అండతోనే పాదయాత్ర సాగుతోందనే విషయం బహిరంగ రహస్యమే.
అయితే.. ఇప్పుడు ఇదే పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనే అననుకూల వాతావరణం ఏర్పడడం.. ఈ జిల్లాలోనే మూడు రాజధానులకు మద్దతుగా ప్రజలు గళం వినిపించడం ఆసక్తిగా మారింది. మరి ఇలాంటి పరిణామాలు.. టీడీపీకి ఇబ్బందేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి చంద్రబాబు ఎలా చూస్తారో చూడాలి.