ప్రపంచ దేశాల ప్రజలు అత్యధికంగా ఉపయోగించే సామాజిక మాధ్యమాల్లో ఒకటయిన ఫేస్బుక్పై మరోసారి పరువు నష్టం దావా దెబ్బ తగిలింది. అయితే, ఎవరో వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కాదు.. రొహింగ్యా శరణార్థులు ఈ పరువు నష్టం దావా వేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం కీలకమైన అంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మయన్మార్ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేషపూరిత ప్రసంగాలు, పోస్టులు అడ్గుకోవడంలో ఫేస్బుక్ విఫలం అయిందని ఆ సామాజిక వేదికపై రొహింగ్యాలు 150 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు.
ఈ మేరకు రొహింగ్యా శరణార్థులు తరఫున న్యాయ కంపెనీలు ఎడల్సన్ పీసీ, పీల్స్ ఎల్ఎల్సీ లు అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయ స్థానంలో దావా వేశారు. ఫెస్బుక్లో పోస్ట్ అయిన ప్రసంగాలు, పోస్టులు తమ పట్ల హింసకు కారణం అయ్యాయని ఈ దావాలో పేర్కొన్నారు. లండన్లోని ఫేస్బుక్ కార్యాలయానికి రొహింగ్యా శరణార్థులు వెళ్లి ఫేస్బుక్కు వ్యతిరేకంగా నోటీసులు అందించారు. 2013లో రోహింగ్యాలకు వ్యతిరేకంగా ప్రచారమైన కొన్ని ఫేస్బుక్ ప్రచారాలను కోర్టుకు ఆధారాలుగా అందజేశారు. మయన్మార్లో ఫేస్బుక్కు 2 కోట్ల మందికి పైగా వినియోగదారులున్నారు.
అయితే, ఫిబ్రవరి 1న తిరుగుబాటు జరిగిన తరువాత మయన్మార్ సైన్యానికి సంబంధించిన విషయాలు పోస్టు కాకుండా నిషేధించడం సహా, పలు కట్టడి చర్యలు తీసుకున్నామని ఫెస్బుక్ ప్రకటించింది. మూడో వ్యక్తి పోస్టు చేసే సమచారం పైన చర్యలు చేపట్టకుండా అమెరికా ఇంటర్నెట్ చట్టం ప్రకారం తమకు రక్షణ ఉందని వెల్లడించింది. గతంలో అనేక సార్లు ఫేస్బుక్పై ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రొహింగ్యా లు ఇలాంటి కేసులు వేసే అవకాశం లేదని తెలుస్తోంది. వీళ్ల తరఫున పలు కంపెనీలు లేదా మీడిఏటర్లు రొహింగ్యాలకు కొంత డబ్బులు ఇచ్చి సంతకాలు పెట్టించుకుంటారనే వాదన కూడా వ్యక్తం అవుతోంది.