తల్లి కోరిన కోరిక తీర్చేసిన ఏపీ మంత్రి... ఆ కోరిక ఇదే..!
తొలిసారిగా ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీ పై వైసీపీ జెండా ఎగరవేయడం లో పెద్దిరెడ్డి వ్యూహాలు కీలకంగా మారాయి. చివరకు లోకేష్, చంద్రబాబు ప్రచారం చేసినా కూడా టీడీపీకి కేవలం ఆరు వార్డులతో సరిపెట్టుకుంది. జగన్ సైతం కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించడంతో పెద్దిరెడ్డి ని పిలిపించుకుని మరీ ప్రత్యేకంగా అభినందించారు. ఇక వచ్చే సాధారణ ఎన్నికల్లో కుప్పం లో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని పెద్దిరెడ్డి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇందు కోసం ఆయన తన తమ్ముడు తనయుడు శ్రీథర్ రెడ్డిని అక్కడ రంగంలోకి దింపారు.
ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి తాజాగా తన తల్లి కోరిక తీర్చాడు. తన స్వగ్రామం అయిన ఎర్ర తివారి పల్లెలో వారి ఇలవేల్పు సదుం ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించారు. గ్రామంలో ఆలయం శిధిలావస్థలో ఉంది. దీంతో ఆలయానికి తిరిగి నిర్మించాలని పెద్దిరెడ్డి తల్లి పద్మావతమ్మ కోరారు. స్వయంగా తన తల్లి కోరడంతో పెద్దిరెడ్డి రెండు నెలల్లోనే అన్ని హంగులతో అమ్మవారి ఆలయాన్ని తిరిగి నిర్మించారు.
అన్ని పనులు పూర్తి కావడంతో సోమవారం ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు.ఆలయంలో జరిగిన ఈ కుంభాభిషేకంలో మంత్రి పెద్దిరెడ్డి - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి - పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కుంభాభిషేకంలో ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకట గౌడ, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసుల తో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు.