మ‌త మార్పిడి : ఇక నుండి అలా చేస్తే జైలుకు వెళ్లాల్సిందే..?

N ANJANEYULU
మతం మార్పిడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు కర్ణాటక  ప్రభుత్వం సిద్ధమవుతున్న‌ది. కేవ‌లం ఒక్క క‌ర్నాట‌క‌లోనే కాదు..  దేశవ్యాప్తంగా మతమార్పిడిలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే ఈ మత మార్పిడులను అడ్డుకునే విధంగా ఎక్కడా చట్టాలు లేవ‌ని..  కర్నాట‌క‌ ప్రలోభాలకు గురి చేసి మతమార్పిడులు చేస్తున్నారని సంఘ్ పరివార్ ఇటీవల ఆరోపణలు చేసిన‌ది. ఈ త‌రుణంలో నాయ్యశాఖ మత మార్పిడి నిషేధ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను కూడా  సిద్ధం చేసిన‌ది.

మతస్వాతంత్రపు సంరక్షణ హక్కు చట్టం- 2021ని బెళగావి లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే దానిని ఆమోదించాలని క‌ర్నాట‌క రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు అమలులోకి వస్తే మత మార్పిడికి పాల్పడే వారికి కఠిన శిక్ష విధించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తీరని వారిని, మహిళలు, మానసిక వైకల్యం ఉన్న వారిని బలవంతంగా మతమార్పిడి చేస్తే మూడేండ్ల కాలం  నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా కూడా విధించ‌నున్నారు. అదేవిధంగా ఇతర వర్గాల వారితో బలవంతంగా మతమార్పిడి చేయిస్తే మూడేండ్ల‌ నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారు.

సామూహికంగా మత మార్పిడీలను  చేయిస్తే మూడేండ్ల నుండి పదేండ్ల‌ వరకు జైలు శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తారు. ఇక‌ స్వచ్ఛందంగా మతమార్పిడి చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ బిల్లులో వెసులుబాటు కల్పించడం జరిగిన‌ది. అలాంటి వారికి ఎటువంటి శిక్షలు,జరిమానాలు విధించరు.  బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ బిల్లుపై ప్రతిపక్షాలైన కాంగ్రెస్, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రహస్య ఎజెండాలో భాగంగా ఈ బిల్లును అమలులోకి తీసుకు రానున్నారని ఇప్ప‌టికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లును చట్టసభల్లోకి తీసుకు వస్తే అడ్డుకుంటామని ఆయా పార్టీలు ప్రకట‌న‌లు చేసాయి. అయితే  ఈ బిల్లు ఏ మతానికి వ్యతిరేకం కాదని.. బలవంతంగా జరిగే మొత్తం మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ బిల్లును అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: