మూడు రాజధానుల సభ రిజల్ట్ ఏంటి..!
రాజధాని రైతులు ఎక్కడైతే.. సభను నిర్వహించారో.. అక్కడే ఆ తిరుపతిలోనే రాయలసీమ మేధావులు కూడా సభను నిర్వహించారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించారు. సీమ మేధావులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మూడు రాజధానులు అవసరమేనని చెప్పుకొచ్చారు. అనేక మంది నాయకులు సీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారని.. అయినప్పటికీ.. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి సాగలేదని.. కనీసం ఇప్పటికైనా.. జగన్ ఇక్కడి ప్రాంతాలపై దృష్టి పెట్టడం మంచి చర్యగా వారు పేర్కొన్నారు.
అయితే.. దీనిని జీర్ణించుకోలేక పోతున్న కొందరు పెద్దలు.. అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తమకు కూడా ఉద్యమించడం వచ్చునని.. చెప్పారు. తాము కూడా త్వరలోనే సీమ ప్రాంత అభివృద్ధి కోసం.. మూడు రాజధానుల కోసం పాదయాత్ర చేపడతామని అన్నారు. ప్రతి ఒక్కరినీ కదిలిస్తామని అన్నారు. అంతేకాదు.. మూడు రాజధానులు ఇచ్చేవారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేలా.. ప్రజలను మోటివేట్ చేస్తామని కూడా ప్రకటించారు.
కర్నూలులో న్యాయ రాజధాని రావడం ద్వారా.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని.. నాయకులు పేర్కొన్నారు. మొత్తానికి భారీ ఎత్తున తరలి వచ్చిన జనం తో సభ అయితే.. సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే.. ఒక వర్గం మీడియా ఈసభకు దూరంగా ఉండడం.. విమర్శలు చేయడం కొసమెరుపు.