ఓర్ని ! ఇలా కూడా ఉంటుందా : తిడితే తిట్టించుకోవాలా.. ఇదీ ఆ నలుగురి తీరు!
వైసీపీలో ఏం జరిగినా మనం నోర్మూసుకుని ఉండాల..లేదంటే అస్సలు వాళ్లూ వీళ్లూ కాదు జగనే ఒప్పుకోరు. నోరు మెదపకుండా రాజకీయం చేయడం కొందరికి అలవాటు. ఆ అలవాటులో భాగంగా చాలా మంది సైలెంట్ గానే తమ పని తాము చేసుకుని పోతా రు. ఇంకొందరు నోరేసుకుని పడిపోయి రాజకీయం చేస్తుంటారు. వారిని అడ్డుకోవడం కానీ వారి గురించి మాట్లాడడం కానీ అస్సలు కుదరని పని. ఇదే ఇప్పుడు జరుగుతున్న నయా పోకడ. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరున్న జగన్ ను ఇంటి మనుషులే నిండా ముంచేలా ఉన్నారు. అందుకు మార్గం కూడా సిద్ధం చేసుకుంటున్నారు. వ్యూహం కూడా పక్కాగానే అమలు చేస్తున్నారు. పైకి చంద్రబాబునో లోకేశ్ బాబునో తిట్టినా అవన్నీ పార్టీకి చేటు తెచ్చేవే అని తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఏమీ లేవని ఎప్పుడో తేలిపోయింది. అందుకు రెండు దశల్లో వచ్చిన కరోనా కూడా ఓ కారణం కావొచ్చు.
అంతేకాదు ముందూ వెనుకా తేడా లేకుండా చూసుకోకుండా చేపట్టిన లేదా చేపడుతున్న పథకాలే కావొచ్చు. ఇవన్నీ జగన్ కు తీరని సమస్యలే! ఈ సమయంలో కొడాలి నాని, పేర్నినాని, అంబటి రాంబాబు, వంశీ మోహన్ వల్లభనేని అనే ఈ నలుగురు కారణంగానే జగన్ కు పెద్ద తలనొప్పి ఎదువుతున్నా వారిని నిలువరించే ప్రయత్నం కానీ నియంత్రించే ధోరణి కానీ జగన్ లో లేదు. దీంతో వారు మరింతగా అదుపు అన్నది లేకుండా ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల దగ్గర మీడియా ఎదుట చులకన అయిపోతున్నారు. అయినా కూడా నష్ట నివారణ అంటే జగన్ సర్ కు ఇష్టం ఉండడం లేదు.