బాబుకే పరీక్ష పెడుతున్న తమ్ముళ్ళు..ఇలా ఉన్నారేంటి స్వామి?
తాజాగా పలు నియోజకవర్గాల్లో కొత్త ఇంచార్జ్లని ఎంపిక చేయడానికి...చంద్రబాబు ఆయా నియోజవర్గాల నేతలని పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా నెల్లిమర్ల, మడకశిర నియోజకవర్గాల ఇంచార్జ్ పదవిపై చర్చ జరిగింది. అయితే ఇంచార్జ్ పదవి కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. పైగా చంద్రబాబు ఊహాకే అందని విధంగా ఆయన ముందే బలపరీక్షకు దిగుతున్నారు. నియోజకవర్గాల నుంచి భారీగా అనుచరులని తీసుకొచ్చి హడావిడి చేసేస్తున్నారు. దీంతో బాబుకే ఎవరిని ఇంచార్జ్గా ఎంపిక చేయాలో అర్ధంకాని పరిస్తితిలో పెడుతున్నారు.
తాజాగా మడకశిర సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తమ తమ అనుచరులతో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు తరలివచ్చి...బలపరీక్షకు దిగారు. అయితే నాయకులతో మాట్లాడి ఇంచార్జ్ పదవిని ఫిక్స్ చేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. అటు నెల్లిమర్ల సీటు విషయంలో కూడా గట్టి పోటీ వచ్చింది.
నెల్లిమర్లలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణస్వామికి వయసు మీద పడింది...ఆయనకు 80 ఏళ్ళు దాటేశాయి. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేరు. ఈ క్రమంలోనే నెల్లిమర్ల సీటు తన మనవడు తారకరామారావుకు ఇవ్వాలని నారాయణస్వామి కోరుతున్నారు. అటు నెల్లిమర్లలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కర్రోతు బంగార్రాజు సైతం ఇంచార్జ్ పదవి ఆశిస్తున్నారు. అలాగే సీనియర్ నేత కళా వెంకట్రావు బంధువు చంద్రశేఖర్ సైతం ఇంచార్జ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ రెండే కాదు పలు నియోజకవర్గాల్లో ఇంచార్జ్ పదవి కోసం తమ్ముళ్ళు బలప్రదర్శనకు దిగుతున్నారు.