ఒమిక్రాన్ టెన్షన్ : సిటీ బస్సు, మెట్రో రైళ్లలో కొత్త రూల్స్.. మళ్లీ ఆంక్షలు..?
అయితే దేశ రాజధానిలో ఒమిక్రాన్ వేరియెంట్ టెన్షన్ కలవర పెడుతున్నది. బాధితుల సంఖ్య పెరగుతుండడంతో ప్రజా రవాణాపై ఆంక్షలు విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ముఖ్యంగా సిటీ బస్సులు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపిస్తున్నారు. ఢిల్లీ మెట్రోకు కూడా ఇదే వర్తిస్తుంది అని పేర్కొంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. 50శాతం మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతినీ ఇచ్చారు. ఒక సీటు తప్పించి మరొక సీటులో కూర్చోవాల్సి ఉంటుంది. మెట్రో ఎంట్రెన్స్ గేట్లల్లో కూడా మార్పులు చేసారు. మెట్రో రైళ్లు, సిటీ బస్సులలో వెళ్లే వారు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుంటే లోపలికి అనుమతించరని, భౌతిక దూరం పాటించాలి అని సూచిస్తున్నారు.
నూతనంగా ఢిల్లీలో కరోనా కేసులు 50 శాతం వరకు పెరుగుదల కనిపించడంతో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం యెల్లో అలెర్ట్ జారీ చేసినది. మళ్లీ ఆంక్షలను కఠినతరం చేస్తూ.. నిత్యవసర సరుకులను అమ్మే దుకాణాలను, మెడికల్ షాపులు మినహా మిగతా షాపులన్నీ సరి, బేసి విధానంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సూచించింది. అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 నుంచి 25 కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు అని సూచనలు చేసింది. ముఖ్యంగా రాజకీయ, మతపరమైన బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించుకునేందుకు ఢిల్లీలో అనుమతి లేదు.
వారంతపు సంతల్లో 50 శాతం మంది వెండర్స్కి మాత్రమే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అందరూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించాలని.. అదేవిధంగా రెస్టారెంట్లకు 50శాతం సీటింగ్ సామర్థ్యంతో ఉదయం 8 నుంచి రాత్రి10 వరకు అనమతినిచ్చారు. బార్లకు మాత్రం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 వరకు అనుమతి ఉన్నది. ఢిల్లీలో నిన్న 496 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కోవిడ్ బారిన పడి 172 మంది కోలుకున్నారు. రికవరీల కంటే కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఢిల్లీలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు 238 సంభవించాయి.