ఆ వైసీపీ ఎమ్మెల్యే చీటి చిరిగిపోయిందా...!

VUYYURU SUBHASH
ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు తమ గెలుపు కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలను... నేతలను కూడా పక్కకు పెట్టేసి తమ‌కు భజన చేసే వారిని .. ఎన్నికల ముందు ... ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని మాత్రమే అందలం ఎక్కిస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో వైసీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు కూడా రోడ్డెక్కి పరిస్థితి కనిపిస్తోంది. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. తాజాగా విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సైతం ఇప్పుడు సొంత పార్టీ క్యాడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారు. వారు బహిరంగంగానే త‌మ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయనను ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాకుండా అడ్డు కోవ‌డం సంచ‌న ల‌నం గా మారింది.

పాయకరావు పేట మండలం రాజవరం గ్రామంలో తాగునీటి పధకాన్ని ప్రారంభోత్సవానికి బాబూ రావు రాగా.. ఆయ‌న ను గ్రామంలోకి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రానివ్వ‌మ‌ని సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. వైసీపీ నేత యజ్ఞల సత్యనారాయణ నేతృత్వంలో ఎమ్మెల్యే బాబూరావును అడ్డుకోవ‌డంతో పాటు కారును ముందుకు రానివ్వ‌లేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుకూల, ప్రతికూల వర్గాలు బాహాబాహీకి దిగ‌డంతో పాటు ఒక‌రిపై మ‌రొక‌రు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

తమ వర్గానికి చెందని వాలంటీర్లను ఎమ్మెల్యే కావాలని తొలగించారని వారు ఫైర్ అవ్వ‌డంతో పెద్ద ర‌చ్చ చేశారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే బాబూరావు చాలా సేపు తన కారులోనే ఉండిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టి చివరకు ఎమ్మెల్యేను ప్రారంభోత్సవానికి తీసుకెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏదేమైనా ఇప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా రెండు బ‌ల‌మైన వ‌ర్గాలు ఏకంగా కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు రాద‌నే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: