పి.ఎం. ఆఫీస్ : డాలర్ ఎక్కడ ? !!
భారత్ లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయం. ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ కార్యాలయం వద్ద డాలర్ కోసం వెతుకులాట జరిగింది. పి.ఎం.ఓ కార్యాలయ సిబ్బంది తో పాటు ఆయన రక్షణ సిబ్బ్ంది కూడా డాలర్ కోసం వెతికారు. ఇది అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?
ప్రధాన మంత్రి ఈ ఏడాది కూడా ప్రతి ఏడాది లాగానే నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి కూడా ఢిల్లీ లోని అధికార పీఠాల వద్ద నూతన సంవత్సర వేడుకలు భారీ స్థాయిలో జరగడం లేదు. కారణాలు ప్రస్తుతం అనవసరం కూడా. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పండితులు ఆయనను కలిశారు. వేద ఆశీర్వచనం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, శ్రీశైలానికి చెందిన పలువురు వేద పండితులు, అర్చకులు ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీని కలిసి ఆశీర్వచనం చేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. అంత వరకూ బాగానే ఉంది ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు, ఆయనకు రక్షణగా ఉండే సిబ్బంది వేద పండితులు ఆశీర్వచనం అందిస్తున్న సమయంలో డాలర్ కోసం వెతికారు. ఆశ్చర్యంగా ఉందా ? అవును ఇది నిజం. వారు వెతికింది ఆభరణాల్లో వేసుకునే డాలర్ కోసం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డాలర్ శేషాద్రి కోసం.