ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్ అయ్యారు. షామీర్పేటలోని నివాసం నుంచి బయటకు వెళ్ళోద్దన్న పోలీసులు... ఆయనను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఆరిపోయే దీపమని.. పోలీసులు అధికార పక్షం కొమ్ము కాస్తున్నారన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని... బండి సంజయ్ అరెస్ట్ చేసిన తీరు ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. కరోనా నెపం పెట్టి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అణచివేసే ప్రయత్నం యదేచ్చగా కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న చట్టం, ఇక్కడున్న పోలీస్ అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తూ వారికి మాత్రమే రక్షణ ఇస్తూ.. వారి కార్యక్రమాలను కొనసాగిస్తూ.. ప్రజల కోసం పని చేసే పార్టీలను మాత్రం గొంతు నొక్కే ప్రయత్నం చేయటం దారుణమని ఫైర్ అయ్యారు. నల్లగొండలో ముఖ్యమంత్రి పర్యటన సమయంలో, కేటీఆర్ గారి పర్యటన సమయంలో వందలు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు, అప్పుడు లేని నిభందనలు ఇప్పుడు ప్రతిపక్షాలకు మాత్రం ఎలా వర్తిస్తాయి? అని నిలదీశారు.
గత కొద్ది రోజులుగా టీచర్లు, ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతుంటే, బావురుమని బెంగటిల్లి చనిపోతుంటే పట్టించుకోరని.. పేర్కొన్నారు. సీనియారిటీ నిర్ధారణ శాస్త్రీయ పద్ధతిలో జరగాలని... స్థానిక పాటించాలని కోరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. వారి మాట వినే నాథుడే లేడన్నారు. వారి పక్షాన బండి సంజయ్ గారు కరీంనగర్ లో తన ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తూ ఉంటే.. వాటర్ కెనాల్ కొట్టడం, గ్యాస్ కట్టర్లతో గేట్లు కట్ చేయడం. బీబత్సం సృష్టించడం.. భయబ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్య అని నిప్పులు చెరిగారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని... ఇది ప్రభుత్వం యొక్క క్రూరత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది ఎల్లకాలం చెల్లదని... దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ ఎలా ఇస్తుందో ఈ ప్రభుత్వం కూడా అంతేనని చెప్పారు. ఈ రోజు మీరు అణచి వేయవచ్చు. కానీ రాబోయే కాలంలో మీకు చేదు అనుభవం తప్పదని హెచ్చరించారు.