గుడ్‌న్యూస్‌.. వాళ్లకు ఆఫీసుకు రాకపోయినా జీతం?

Chakravarthi Kalyan
దేశంలో మరోసారి కరోనా ఉధృతి జోరుగా ఉంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. అంతే కాదు.. ప్రతి రెండు, మూడు రోజులకు ఓసారి ఈ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు అలాగే ఉంది తీరు కూడా. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కాస్త వెసులుబాటు ఇస్తోంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోని గర్భిణిలు, దివ్యాంగులు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని కేంద్రం వెసులుబాటు ఇచ్చేసింది.


కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గర్భిణిలు, దివ్యాంగులు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదట. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రకటించారు. వీరే కాదు.. ఇప్పటికే కొవిడ్‌ కంటైన్మెంట్‌ జోన్లలో నివాసముంటున్న అధికారులు, సిబ్బంది కూడా ఆఫీసులకు రావాల్సిన పని లేదు.


ప్రభుత్వ ఉద్యోగులు తమ నివాస ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ జాబితాలో నుంచి తీసివేసిన తర్వాతే వారు ఆఫీస్‌కు రావాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అప్పటివరకు అలాంటి వారందరికీ ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కేంద్రం కల్పిస్తుంది. దిల్లీలో కరోనా విజృంభిస్తున్న దష్ట్యా కేంద్రం అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో అండర్‌ సెక్రటరీ కంటే కిందిస్థాయి ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే రావాలని తెలిపింది.



మిగిలిన 50 శాతం మందికి ఇకపై ఇంటినుంచి పనిచేసే విధానం అమలు చేస్తారు. ఇందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు. ఇకపై  అధికారిక సమావేశాలను వర్చువల్‌ విధానంలో నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కొత్త విధానం జనవరి 31వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయిని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. బావుంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: