తెలంగాణలో అత్యంత చౌకైన భూములు ఆ జిల్లాలోనే ?
ఇక తెలంగాణలో అత్యధిక ధర పలుకుతున్న భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి తెలంగాణలో అతి చవకైన భూములు ఎక్కడ ఉన్నాయి.. ఈ విషయాన్ని ప్రభుత్వమే పరోక్షంగా చెబుతోంది. ప్రభుత్వం తాజాగా పెంచుతున్న భూముల విలువల్లో అతి తక్కువగా పెంచింది ములుగు జిల్లాలో.. అంటే అక్కడే తక్కువ ధర ఉన్నట్టు ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. వరంగల్ జిల్లా నుంచి విడిపోయి జిల్లాగా ఏర్పడిన ములుగులో జిల్లా కేంద్రంలోనూ చదరపు గజం రూ.1,250గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. అంటే ఇది రిజిస్ట్రేషన్ రేటు అన్నమాట.
సాధారణ మార్కెట్ ధరలో చెప్పుకోవాలంటే.. గజం రెండు నుంచి మూడు వేల వరకూ దొరికే అవకాశం ఉండొచ్చు. ఇక తెలంగాణలో ములుగు తర్వాత తక్కువ ధర ఉంది భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్.. ఇక్కజ ప్రభుత్వం లెక్కల ప్రకారం గజం రూ.1,700గా ఉంది. సాధారణంగా జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. జిల్లా కేంద్రం కావడం వల్ల ఆ డిమాండ్ ఉంటుంది. అయితే.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలను మించిన రేట్లు ఉన్నాయట.
పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, జగిత్యాల జిల్లా కోరుట్లలోనూ.. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోనూ.. మెదక్జిల్లా తూప్రాన్లోనూ.. వికారాబాద్ జిల్లా పరిగిలోనూ.. నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలోనూ.. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలోనూ.. నారాయణపేట జిల్లా మక్తల్లోనూ జిల్లా కేంద్రాన్ని మించి భూముల మార్కెట్ విలువలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.