మాజీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే -ఏపీ పోలీసుల డిమాండ్

Deekshitha Reddy
నెల్లూరులో నారీ భేరీ దీక్ష చేపట్టారు తెలుగు మహిళలు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాటల తూటాలు పేలాయి. తెలుగు మహిళలంతా ఉత్సాహంగా స్పీచ్ లు ఇచ్చారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓ అడుగు ముందుకేసి.. ఏపీ మంత్రుల్ని తీవ్రంగా విమర్శించారు. సీఎం జగన్ పై కూడా ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే అక్కడితో ఆగలేదు అనిత. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావుపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్థానిక పోలీస్ అధికారులు మండిపడుతున్నారు.

గతంలో కొన్ని కేసుల్లో మహిళల్ని నైటీలతో పోలీస్ స్టేషన్లకు తీసుకొచ్చారని, జిల్లా ఎస్పీ దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఓ దశలో ఎస్పీ కుటుంబ సభ్యుల్ని ఉదాహరణగా చూపిస్తూ మండిపడ్డారు. అసలు ఎస్పీ ఐపీఎస్ చదివి పాసయ్యారా లేదా అంటూ నిలదీశారు. దీంతో నెల్లూరు జిల్లా పోలీసులు మండిపడ్డారు. అనిత క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.

రాజకీయ స్వార్థంకోసం మాపై నిందలా..?
నెల్లూరులో వంగలపూడి అనిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడంతో జిల్లా పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. జిల్లా ఏఎస్పీ సహా ఇతర అధికారులంతా ప్రెస్ మీట్లు పెట్టి అనిత వ్యాఖ్యల్ని ఖండించారు. రాజకీయ స్వలాభం కోసం పోలీసు వ్యవస్థని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తిప్పికొట్టారు. అసలు ఎస్పీ కుటుంబ సభ్యుల ప్రస్తావన ఎందుకొచ్చిందంటూ నిలదీశారు. మహిళ అయి ఉండి.. ఎస్పీ కుటుంబ సభ్యుల గురించి అలా మాట్లాడటం సరికాదంటున్నారు పోలీసులు. జిల్లా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా సామూహికంగా ఆమె వ్యాఖ్యల్ని ఖండించడం విశేషం. వంగలపూడి అనిత పోలీస్ డిపార్ట్ మెంట్ కి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు. మరి టీడీపీ తరపున పోలీసుల వ్యాఖ్యలకు ఇంకా సమాధానం రాలేదు. అటు అనిత కూడా పోలీసుల వ్యాఖ్యలపై ఇప్పటి వరకు స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: