అయ్యో.. ఆంధ్రాకు కూడా త్వరలోనే శ్రీలంక గతి?

Chakravarthi Kalyan
మన దిగువన ఉన్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆహార సంక్షోభం కారణంగా అక్కడ ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క కోడి గుడ్డు 40 రూపాయల ధర పలుకుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యావసరాల కోసం జనం బారులు తీరుతున్నారు. ఇప్పుడు శ్రీలంక పరిస్థితిని తమకు అనకూలంగా మలచుకుంటున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల ప్రచారంలో పార్టీలిచ్చే హామీలు ప్రజలకు సంపద సృష్టించుకునే మార్గాలుగా ఉండాలే తప్ప ప్రజలను సోమరిపోతులుగా మార్చే విధానాలుగా ఉండకూడదనేది.. అలా ఉంటే.. శ్రీలంక లాగానే మన ఆంధ్రా కూడా తయారవుతుందని చెబుతున్నారు.


తాజాగా శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి నాయకత్వ లోపమే కారణమని.. ముందు ముందు ఏపీ పరిస్థితి కూడా ఇంతేనని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో ఉన్న ఆర్ధిక పరిస్థితులు చూస్తే త్వరలో ఏపీ కూడా మరో శ్రీలంకలా మారనుందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలసీల వలన రాష్ట్రంలో సంపద సృష్టి జరగటం లేదన్న లోకేశ్.. సంపద సృష్టి లేకపోతే వచ్చేది ఆర్ధిక సంక్షోభమేనని నారా లోకేష్ హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయకపోతే ఏపీ మరో శ్రీలంక అవుతుందని లోకేశ్ హెచ్చరిస్తున్నారు.


అమ్మ ఒడి, జగనన్న చేయుత అంటూ ఇచ్చే డబ్బును మళ్లీ ప్రభుత్వమే ఫైన్ ల రూపంలో వెనుక్కు తీసుకుంటోందని.. పేదలకు ఉచిత పథకాలని చెత్త మీద పన్నులు వేస్తున్నారని లోకేశ్ విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణ అంటూ రాష్ట్రాన్ని జగన్ విచ్ఛినం చేసాడని.. అభివృద్ధి చేయటం చేత కాక మాటలతో కాలయాపన చేస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి అక్రమాలతో విశాఖ వాసులు కంగారు పడుతున్నారన్న లోకేశ్.. ఇక జగన్ కూడా అక్కడికి వెళ్తే విశాఖ ప్రజలు వలస పోతారని ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: