టీడీపీకి 40 ఏళ్లు: ఈ ప్రశ్నలకు బదులేది?

Chakravarthi Kalyan
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి 40 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు 40 వ వార్షికోత్సం వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ఈ ఏర్పాట్లపై రెండు, మూడు రోజులుగా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే., ఇదే సమయంలో వైసీపీ కూడా టీడీపీపై విమర్శలు గుప్పిస్తోంది. అసలు.. ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవి లాక్కుని భూస్థాపితం చేసిన చంద్రబాబు, ఇప్పుడు 40 ఏళ్ల ఉత్సవాలు చేయడం ఎంత వరకూ సబబు అన్న అంశాన్ని తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.


అసలు వెన్నుపోటుదార్లకు పార్టీ 40 ఏళ్ల ఉత్సవాలు నిర్వహించే అసలు హక్కు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు. అప్పట్లో  ఎన్టీ రామారావు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. కానీ చంద్రబాబు ప్రస్తుతం నడుపుతున్నది తెగులు దేశం పార్టీ అని.. అదే రాష్ట్రానికి పట్టిన తెగులు అని  అంబ‌టి రాంబాబు మండిపడుతున్నారు. టీడీపీ కి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు  అంబ‌టి రాంబాబు.


ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని, ఆ పార్టీ గుర్తును, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను, ఆయన కుర్చీని చంద్రబాబు లాక్కున్న వైనంపైనా.. ఆయన చేసిన విధ్వంసంపైనా వాడవాడలా 29వ తేదీన చర్చ జరగాల్సిన అవసరం ఉందని అంబటి అంటున్నారు. అంతే కాదు.. దేశ రాజకీయ చరిత్రలో ఒక చీడపురుగలా మారిన చంద్రబాబు మనస్తత్వంపై కూడా వాడవాడలా చర్చ జరగాలని అంబటి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు.


చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసిన తీరుపైనా వాటిని భ్రష్టు పట్టించిన తీరుపైనా తాను ఎదగడానికి వ్యవస్థలను వాడుకుని వాటిని సర్వనాశనం చేసిన తీరుపైనా వీధి వీధినా తెలుగు ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు దౌర్భాగ్యమైన పాలన వల్ల, ఆయన దౌర్భాగ్యమైన పాలసీల వల్ల టీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు ఆవిర్భవించిన తీరుపైన కూడా చర్చ జరగాలని అంబటి రాంబాబు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: