2024లో ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతేనా..?
గడప గడప కార్యక్రమంపై పీకే టీమ్ అన్ని వివరాలను జగన్ కి ఎప్పటికప్పుడు అందిస్తోంది. ఏపీలో ఆ కార్యక్రమంలో ఎలా జరుగుతోంది. ఎవరెవరు వెళ్లారు, ఎవరు డుమ్మా కొడుతున్నారు, ఎవరు తూతూ మంత్రంగా కార్యక్రమం చేస్తున్నారనే విషయాలను పీకే టీమ్ వారికి వివరిస్తోంది. దీంతో జగన్ ఆ లిస్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు. గడ గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేల పని తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జగన్ కు పీకే టీమ్ పూర్తిగా వివరించింది. రాష్ట్రంలో 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కనీసం 10 రోజులు కూడా గడప గడపకు వెళ్లలేదని వారు చెప్పారు. అదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు అస్సలు ఆ కార్యక్రమం జోలికి వెళ్లలేదన్నారు. ఆ ఇద్దరికీ జగన్ చీవాట్లు పెట్టారు. 22మందిని అలర్ట్ కావాలని సూచించారు.
ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, ప్రజలతోపాటు మమేకం కావాలిని, అలా చేయకపోతే తనకేం నష్టం లేదని, ఎమ్మెల్యేలే తిరిగి గెలవలేరని అన్నారు జగన్. అస్సలు జనంలోకి వెళ్లకపోయినా, మొక్కుబడిగా గడప గడపకు తిరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఆతర్వాత తనను ఎన్ని అనుకున్నా ప్రయోజనం ఉండదని చెప్పారు జగన్. ఒకరకంగా జగన్ ఇన్ డైెరెక్ట్ గా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయంపై ముందుగానే హింట్ ఇచ్చారు. జగన్ వార్నింగ్ తో ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ద్వారా సీఎం జగన్ సమాచారం సేకరిస్తున్నారు. దానికితోడు పీకే టీమ్ కూడా జగన్ కి రిపోర్ట్ లు ఇస్తోంది. పీకే టీమ్ నిస్పక్షపాతంగా జగన్ కి రిపోర్ట్ లు ఇస్తోంది. దీంతో కొంతమంది ఎమ్మెల్యోలలో ఇప్పటినుంచే గుబులు మొదలైంది.