ఇక సామాన్య పేద మధ్య తరగతి ప్రజలకు టమాట రేట్లు అనేవి చాలా పెద్ద సమస్యగా మారాయి. ఖరీఫ్లో టమాట సాగు అనేది ఇక చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. దాంతో టమాట ధర అమాంతం పెరిగిపోయింది. దిగుబడి కరువై మార్కెట్కు తక్కువ పరిమాణంలో వస్తుండటంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత నెల 1వ తేదీన కడప రైతు బజార్ లో కిలో 11 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం 35 రూపాయలకు.. ఇక బయటి మార్కెట్లో కిలో ధర 50 రూపాయలకు చేరువైంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 470 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మైలవరం, కలసపాడు, ఎర్రగుంట్ల, ఖాజీపేట, సింహాద్రిపురం, వీఎన్ పల్లె, లింగాల, తొండూరు, సీకేదిన్నె, పెండ్లిమర్రి, చక్రాయిపేట మండలాల్లో ఎక్కువగా టమాట సాగు చేశారు.అయితే ఈ నెలాఖరుకు కోతలు ముగుస్తాయి. ఫలితంగా మార్కెట్కు ఆశించినంతగా టమటా రావడం లేదు. దాంతో వీటి ధరలు ఆకాశాన్నంటేలా పెరిగిపోయాయి.
జూలై 20 - 25 మధ్య కిలో 10 రూపాయలకు దొరికేది.. కానీ ఇప్పుడు 35 రూపాయలకు చేరింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.కడప జిల్లాలో ఎక్కువగా సాగు చేసే టమాటలు హైదరాబాద్తో పాటు బెంగళూరు మార్కెట్కు వెళ్తుంది. అయితే, గత కొన్నిరోజులుగా ఖరీఫ్ సాగు చివరి దశకు చేరడంతో దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు కడపలో దొరుకుతున్న టమాట కేవలం జిల్లా వాసులకే సరిపోయేదిగా ఉంది. అలాగే, దిగుబడి లేక ధర కూడా అమాంతం పెరిగిపోయింది. కొత్తగా టమాట నారు నాటి ఉత్పత్తి వచ్చే వరకు టమాట ధరలు మరింత పైకి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.గతంలో కూడా ఇలానే టమటా ధరలు భయపెట్టాయి. కేవలం బహిరంగ మార్కెట్లోనే కాదు.. హోల్ సేల్ మార్కెట్ లోనూ కూడా.. కిలో టమటా సెంచరీ దాటింది. దీంతో చాలామంది అటువైపు చూడాలి అంటేనే భయపడ్డారు.