అమరావతి : టీడీపీ సీట్లపైన జనసేన కన్నేసిందా ? తగ్గేదేలేదా ?

Vijaya



జనసేన పార్టీ నేతల వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం తమకే దక్కాలని జనసేన నేతలు పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. జనసేన నేతలు ప్రధానంగా మంగళగిరి, తిరుపతి, పిఠాపురం, పాయకరావుపేట, రాజమండ్రి, కాకినాడ, తెనాలి, నర్సాపురం, నెల్లూరు, భీమవరం, భీమిలి నియోజకవర్గాలపైన బాగా ఫోకస్  చేస్తున్నట్లుంది. ఇప్పటికి బాగా డిమాండ్లు వినిపిస్తున్న నియోజకవర్గాలివే. ముందు ముందు ఇంకెన్ని నియోజకవర్గాలను డిమాండ్ చేస్తారో తెలీదు.





నిజానికి పొత్తుల విషయం, పోటీచేసే సంఖ్య, నియోజకవర్గాలు ఏవనే విషయం చంద్రబాబునాయుడు-పవన్ కల్యాణ్ స్ధాయిలో డిసైడ్ అవుతాయి. అయితే వీళ్ళిద్దరు కూర్చునే ముందు తమ పార్టీ నేతలతో భేటీ అవుతారు. పార్టీల నేతల నుండి ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటారు. ఇప్పటికే రెండుపార్టీలు వేర్వేరుగా సర్వేలు చేయించుకున్నాయి. దాని ప్రకారం రెండుపార్టీలు నియోజకవర్గాల జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. ఓవరాల్ గా నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాల విషయంలో ఇద్దరికీ ఒక అంచనా వచ్చేసుంటుంది.





అయితే ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నపుడే పై విషయాలపై క్లారిటి వస్తుంది. అయితే ఈలోగా పై నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉండటంతో పాటు తమకు బాగా పట్టుందని జనసేన నేతలు కూడా అనుకుంటున్నారు. అందుకనే ఎట్టి పరిస్ధితుల్లోను పై నియోజకవర్గాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని మరో 15 సీట్లలో పోటీచేయాల్సిందే అని జనసేన నేతలు ఇప్పటికే పవన్ కు కచ్చితంగా చెప్పేశారట.





మరి జనసేన నేతల తీరుచూస్తుంటే తాము పట్టుబడుతున్న నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం రాకపోతే టీడీపీ అభ్యర్ధులకు సహకరించేది అనుమానంగానే ఉంది. తెనాలి, తిరుపతి, పాయకరావుపేట, నెల్లూరు, పిఠాపురం లాంటి సీట్లలో పోటీ విషయమై జనసేన నేతలు మహాపట్టుగా ఉన్నారు. మరి పొత్తుల విషయం ఎప్పుడు ఫైనల్ అవుతుంది ? అసంతృప్తిగా ఉన్న నేతలను ఎలా దారికి తెచ్చుకుంటారనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది. వీళ్ళిద్దరి వ్యవహారమే ఎటూ తేలకపోతే మధ్యలో బీజేపీ కూడా దూరితే చంద్రబాబు పరిస్ధితి అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: