అమరావతి : అందరు కలిసి పవన్ కు గంటకట్టారా ?

Vijaya



గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. నిరాధారమైన ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ ఇపుడు వివాదంలో కూరుకుపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమని పవన్ చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ ఆరోపణలు చేశారో అప్పటి నుండి వాలంటీర్లందరు రోడ్డుపైకి ఎక్కారు. అప్పటివరకు థియేటర్లముందు కటౌట్లకు పాలాభిషేకాలు, టపాకయలు పేలటం మాత్రమే అనుభవమైన పవన్ కు మొదటిసారి చీత్కారాలు, పోస్టర్లకు చెప్పులతో సత్కారాలు , దిష్టబొమ్మల దహనాలు ఊహించని పరిణామమనే చెప్పాలి.





విచిత్రం ఏమిటంటే పవన్ వ్యాఖ్యలపై మూడురోజులుగా ఇంత గందరగోళం జరుగుతుంటే ప్రతిపక్షాల్లో ఒక్కటంటే ఒక్కపార్టీ కూడా మద్దతుగా మాట్లాడకపోవటం. చివరకు మిత్రపక్షం బీజేపీ కూడా తనకేమీ సంబంధంలేదన్నట్లుగానే ఉండిపోయింది. జరుగుతున్న గొడవను అందరు చోద్యం చూస్తున్నారు.  ప్రతిపక్షాలు ఎందుకిలా చేస్తున్నాయంటే అందరు కలిసే పవన్ మెడలో గంట కట్టారనే అనిపిస్తోంది. ఇక్కడ ప్రతిపక్షాలంటే ముఖ్యంగా టీడీపీ+ఎల్లోమీడియా మాత్రమే. జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ ఏమి మాట్లాడినా, ఎల్లోమీడియా ఏమిరాసినా ఎవరూ పట్టించుకోవటంలేదు.





పవన్ మాట్లాడినంత మాత్రాన ఏమో అయిపోతుందని కాదు. కాకపోతే సినిమాల్లో ఏ హీరోకి లేనంతగా   పవన్ కు విపరీతమైన ఫ్యాన్ బేసుంది. కనీసం వాళ్ళు నమ్మితే చాలు పవన్ ఆరోపణలను అనుకున్నట్లున్నారు. అయితే చాలామంది నమ్మటంలేదన్న విషయం తెలీటంలేదు. 





అందుకనే చేయలేని ఆరోపణలు, రాయలేని కథనాలను పవన్ ద్వారా చెప్పించినట్లుంది. అయితే ముందువెనకా ఆలోచించేంత శక్తిలేని పవన్ కూడా నోటికొచ్చిన ఆరోపణలు చేసేశారు. రేపు ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ఏ ఆధారాలతో తాను ఆరోపణలు చేశాను అనే విషయాన్ని పవన్ నిరూపించుకోవాలి. ఎందుకంటే తన ఆరోపణలకు కేంద్ర ఇంటిలజెన్స్ అధికారులనే పవన్ ప్రస్తావించారు కాబట్టి. మరి కోర్టులో కేసు ఎవరు వేస్తారు ? కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది, పవన్ ఏమి ఆధారాలను చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: