హైదరాబాద్ : కమలం సీనియర్లకు ఏమైంది ?
ఇపుడిదే విషయం ఎవరికీ అర్ధంకావటంలేదు. కొంతకాలం క్రితంవరకు తెలంగాణా బీజేపీలో మంచి జోష్ కనిపించింది. అలాంటిది అంటే సుమారు రెండు నెలల నుండి అంతా స్తబ్దుగా ఉంటున్నది. సీనియర్లు ఏమయ్యారు ? యువనేతలు ఏమైపోయారో ఎవరికీ అర్ధంకావటంలేదు. కేంద్రమంత్రులు వచ్చినపుడు కాస్త హుడావుడి చేయటం తర్వాత చడీచప్పుడు లేకుండా మాయమైపోవటం మామూలైపోయింది. ఉదాహరణకు ఖమ్మంలో బహిరంగసభకు కేంద్రహోంమంత్రి అమిత్ షా వచ్చారు. రైతు గోస అంటే రైతుల సమస్యలకు ఏదో పరిష్కారం దొరుకుతుందని అందరు అనుకున్నారు.
విచిత్రంగా అమిత్ షా మాటల్లో రైతు సమస్యలకు పరిష్కారం దొరకలేదు, హామీ కూడా ఇవ్వకుండానే ముగిసిపోయింది. పార్టీ నేతలకు ఫుల్లుగా క్లాసుపీకేసి జోష్ తో పనిచేయాలని చెప్పి వెళ్ళిపోయారు. పార్టీలో సహజంగా ఉండాల్సిన బలం లేనపుడు ఇక జోష్ మాత్రం ఎక్కడినుండి వస్తుంది. అమిత్ రాక సందర్భంగా కాస్త హడావుడిచేసిన నేతలు గడచిన మూడురోజులుగా అడ్రస్ లేకుండాపోయారు. దాంతో పార్టీలో ఏమి జరుగుతోందో కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు.
పార్టీలో చేరిన కొంతమంది నేతల్లో అయితే అయోమయం పెరిగిపోతున్నట్లు సమాచారం. పార్టీలోనే కంటిన్యు అవ్వాలా లేకపోతే బయటకు వెళ్ళిపోవాలా అన్న విషయం కూడా తేల్చుకోలేకపోతున్నారట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దెబ్బ బీజేపీ మీద దారుణంగా పడినట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు. అలాగే బండి సంజయ్ ని అర్ధాంతరంగా అధ్యక్షుడిగా తొలగించి ఆ ప్లేసులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించటంతో రెండో దెబ్బపడిందట.
కాంగ్రెస్ లో నుండి ఏవేవో లెక్కలేసుకుని బీజేపీ చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఆయన గొంతు ఎక్కడా వినబడటంలేదు. మాజీ ఎంపీ వివేక్ అసలు అడ్రసే లేకుండా తిరుగుతున్నారు. విజయశాంతి చాలాకాలంగా పార్టీ అగ్రనేతలపై చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే అసలు ఎక్కడా కనిపించటమే లేదు. బండి సంజయ్ రాష్ట్రవ్యవహారాల్లో అసలు జోక్యమే చేసుకోవటంలేదట. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అసలు పార్టీ ఆఫీసుకే రావటంలేదని సమాచారం. ఈటల కూడా పెద్ద యాక్టివ్ గా లేరు. తలా ఒకరకంగా వ్యవహరిస్తుండటంతో సీనియర్లకు ఏమైందో ఎవరికీ అర్ధంకావటంలేదు.