'భారతరత్న' డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి నేడు.ఆయన పుట్టిన రోజును ఆయనకి గౌరవం ఇస్తూ 1962వ సంవత్సరం నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకొంటున్నాం.ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత రాధా కృష్ణన్ గారి సొంతం.అయితే,ఆయన రాష్ట్రపతిగా కంటే తత్వవేత్తగానే ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు.ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, రచయితగా ఇంకా రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది.తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో 1888లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫసర్ అయ్యారు.ఉపాధ్యాయుడిగా అక్కడి నుంచే విద్యార్థులపై ఆయన చెరగని ముద్ర వేశారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనవర్సిటీలో కూడా ఆయన పాఠాలు చెప్పారు.భారతీయ తత్వాన్ని ప్రపంచానికి అందించేందుకు ఎన్నో పుస్తకాలు రాశారు.ఇక రాధాకృష్ణన్ మైసూర్లోని మహారాజా కళాశాల నుంచి బదిలీ అయినప్పుడు ఆయనకు విద్యార్థులు మరిచిపోలేనిరీతిలో వీడ్కోలు పలికారు.
అందంగా ముస్తాబు చేసిన గుర్రంపై ఆయనను ఊరేగించాలని విద్యార్థులు భావించారు. ఇంకా సర్వేపల్లిని కూడా ఒప్పించారు.తీరా సమయానికి ఆ గుర్రం కనిపించకుండా పోయింది. అప్పుడు విద్యార్థులు తమ భుజాలపై రాధాకృష్ణన్ను ఊరేగింపుగా రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్లి వీడ్కోలు పలికారు.1949 వ సంవత్సరంలో రష్యా రాయబారిగా వెళ్లినప్పుడు రాధాకృష్ణన్ అక్కడ తదైన ముద్రవేశారు. కశ్మీర్ విషయంలో రష్యా మద్దతు భారత్కు లభించేలా ఆయన కృషిచేశారు.తన వాక్చాతుర్యంతో ఒక సందర్భంలో స్టాలిన్ను కూడా ఎంతో మెప్పించారు.1950 వ సంవత్సరంలో ఆయన స్టాలిన్ను కలిసినప్పుడు ప్రచ్చన్న యుద్ధాన్ని ఆపేందుకు కృషిచేయాలని కోరారు. ఇక అప్పుడు స్టాలిన్ ''చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి. ప్రచ్చన్న యుద్ధం ముగించే బాధ్యత అవతలి పక్షం తీసుకోవాలి' అని పేర్కొన్నారు.అప్పుడు రాధాకృష్ణన్ గారు స్పందిస్తూ ''మిస్టర్ స్టాలిన్, శాంతికాముక దేశంగా రష్యా తన చేతిని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే చప్పట్లు కొట్టాలంటే ఖచ్చితంగా రెండు చేతులు కావాలి కదా'' అని పేర్కొన్నారు.ఆయన ఇచ్చిన సమాధానానికి స్టాలిన్కు నోట మాటరాలేదు.అలా స్టాలిన్ నే మెప్పించారు రాధా కృష్ణన్.