అమరావతి : పార్టీ మీద కూడా కత్తి వేలాడుతోందా ?
తెలుగుదేశంపార్టీ మీద అనర్హత వేటు తప్పదా ? పార్టీ మీద కూడా కేసుల కత్తి వేలాడుతోందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు తాను ఇరుక్కోవటమే కాకుండా పార్టీని కూడా ఇరికించేసినట్లే కనబడుతోంది. స్కామ్ లోని రు. 371 కోట్ల దోపిడీలో రు. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమైనట్లు సీఐడీ ఆధారాలను చూపించింది. పార్టీ బ్యాంకు ఖాతా ట్రాన్సాక్షన్ను జడ్జిముందు ఉంచింది. ఆ రు. 27 కోట్లు ముడుపులే అని సీఐడీ వాదిస్తోంది. ఇపుడీ విషయమే కీలకం కాబోతోంది.
పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎల్లోమీడియా వాదన ప్రకారం ఆ రు. 27 కోట్లు పార్టీకి అందిన విరాళమే కానీ ముడుపులు కావట. మరి అదే నిజమైతే అంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన కంపెనీ, సంస్ధ, వ్యక్తి పేరు చెప్పాలి కదా. అయితే ఆ ప్రశ్నకు అచ్చెన్న సమాధానం చెప్పటంలేదు. ఇక్కడే ఒక సమస్య ఏమిటంటే ఎలక్టోరల్ బాండ్ రూపంలో టీడీపీకి విరాళం వచ్చిందంటే ఎక్కడినుండి వచ్చిందనేది పెద్ద సమస్య. ఎలక్టోరల్ బాండ్స్ జారీచేసే అధికారం దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తప్ప ఇంకో బ్యాంకుకు లేదు.
సీఐడీ వాదన ప్రకారం టీడీపీకి అందిన విరాళం యూటిఐ బ్యాంకు నుండి వచ్చిందట. వచ్చిన విరాళం క్యాఫ్ డిపాజిట్టా లేకపోతే బాండ్ల రూపంలోనే అన్నది చెప్పలేదు. ఎలక్టోరల్ బాండ్లు ఎస్బీఐ జారీచేయాల్సుండగా యూటీఐ బ్యాంకు నుండి ఎలా వచ్చింది ? సరే ఏ బ్యాంకు నుండి అందినా అంతమొత్తం ఇచ్చింది ఎవరు ? అన్నదే కీలకం. ఇక్కడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో పడిందని ఈడీ చెప్పింది. దాంతో కోర్టు జోక్యం చేసుకుని మరి పార్టీని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని తీవ్రంగా ప్రశ్నించటమే కాకుండా చేర్చమని ఆదేశించింది.
అదే పద్దతిలో స్కిల్ స్కామ్ లో అందిన ముడుపులను చూపించి సీఐడీ కూడా టీడీపీని నిందితుల జాబితాలో చేర్చే అవకాశముందని న్యాయనిపుణులంటున్నారు. అదే జరిగితే టీడీపీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయిపోవటం, పార్టీ కార్యాలయాలు సీజ్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.