రేవంత్ ఎన్ని చెప్పినా.. ఆ క్రెడిట్ కేటీఆర్దే?
హైదరాబాద్ - కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్ - నాగపూర్ జాతీయ రహదారి మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ భారాస సాధించిన విజయమని కేటీఆర్ అంటున్నారు. గత జూలై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందన్న మాజీ మంత్రి కేటీఆర్... అందుకు అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామని అన్నారు.
గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందన్న మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయన్నారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించి, కేంద్రాన్ని ఒప్పించేందుకు నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను, ఇతర మంత్రులు, ఎంపీలు... ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించినట్లు మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఇక ఆయా మార్గాల్లో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.