మొత్తానికి ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది మాత్రమే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అలాగే దేశంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ చాలా ఏళ్ల తర్వాత కలిశాయి.అందువల్ల రెండు పార్టీలకు మంచి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఈ క్రమంలోనే.. తమ పొత్తును ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాయి. అందుకే టీడీపీ, జనసేన ఇంకా బీజేపీ ఈ నెల 17న చిలకలూరిపేట సభను వేదికగా చేసుకోవాలని చూస్తున్నాయి. మొదట్నించి కూడా పొత్తులో ఉన్న టీడీపీ-జనసేన ఇప్పటికే తాడేపల్లిగూడెం, మంగళగిరిలో రెండు ఉమ్మడి సభలు జరిపాయి. ఇప్పుడు బీజేపీ కూడా తోడవ్వడంతో.. చిలకలూరిపేట సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఎన్డీఏలో టీడీపీ-జనసేన పార్టీలు చేరడంతో.. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్.. మోడీ కన్ఫామ్ చేస్తే.. ఒకరోజు అటూ ఇటుగా అయినా సభ.. పెద్దఎత్తున జరపాలని వారు చూస్తున్నారు. ఈ మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేట సభకు 10లక్షల మందిని తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఇక ఈసారి తమ సభకు బస్సుల సమస్య రాకుండా.. అచ్చెన్నాయుడు ముందే మేల్కొన్నారు. సభకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీకి లేఖని కూడా రాశారు.ఎన్డీఏ కూటమిగా జరిపే మొదటి సభ ఈ చిలకలూరిపేట బహిరంగ సభ. నిన్నమొన్నటి దాకా ఎన్డీఏలో చేర్చుకుంటారా లేదా అనే డౌట్ ఉండేది. కానీ మూడు పార్టీలు కలవడం అలాగే ఎన్డీఏకు బలం పెరగడంతో.. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి.. తమ బలం, బలగం ఏంటో చూపించాలనుకుంటున్నాయి బీజేపీ, టీడీపీ. జనసేన, జన సమీకరణే కాకుండా.. గెలిస్తే తామేం చేస్తామో కూడా ఇదే సభ నుంచి ప్రజలకు క్లారిటీగా చెప్పాలని చూస్తున్నారు మూడు పార్టీల నేతలు. మరి మూడు పార్టీల ఉమ్మడి మీటింగ్ ఎలా ఉంటుందో చూడాలంటే ఖచ్చితంగా ఈ నెల 17 వ తేదీ వరకు ఆగాల్సిందే.