అమరావతి : మోడీని చూసి ఎవరైనా ఓట్లేస్తారా ?
ఏపీ విషయంలో నరేంద్రమోడీనే అతిపెద్ద విలన్. 2014లో రాష్ట్ర విభజన జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో మోడి మాట్లాడుతు విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలుచేస్తామని, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని జనాలను నమ్మించారు. మోడీ మాటలు, హామీలను నమ్మి బీజేపీకి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రయోజనాలను మోడి తుంగలో తొక్కేశారు. హోదా లేదు, రైల్వేజోన్ పోయింది, పోలవరానికి నిధులు ఇవ్వలేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేదు.
ఇలా ఏ విషయం తీసుకున్నా ఏపీని మోడి ప్రభుత్వం దెబ్బకొట్టింది. అప్పట్లో చంద్రబాబునాయుడు చేతకానితనం కూడా మోడీకి బాగా కలిసొచ్చింది. అందుకనే మోడీ ప్రభుత్వం ఏపీని ఎంత నిర్లక్ష్యంచేసినా చంద్రబాబు నోరెత్తలేదు. 2019 ఎన్నికల్లో గెలుపును దృష్టిలో పెట్టుకుని 2018 చివరలో చంద్రబాబు ఎన్డీయేలొ నుండి వచ్చేశారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారాలు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయిన తర్వాత కూడా కేంద్రం నుండి రావాల్సినంతగా ప్రయోజనాలను రాబట్టలేకపోయారు. హోదాను సాధించలేకపోయారు, రైల్వేజోన్నూ తేలేకపోయారు.
అంటే హోలు మొత్తంమీద చూస్తే విభజనతో ఏపీకి కాంగ్రెస్ ఎంత ద్రోహంచేసిందో తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వం అంతకన్నా అన్యాయంచేసిందనే మంట జనాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇందుకు 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లే నిదర్శనం. అరశాతం ఓట్లను కూడా బీజేపీ తెచ్చుకోలేదంటేనే జనాల్లో ఎంతమంటుందో అర్ధమవుతోంది. అలాంటిది రేపటి ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. ఈనెల 17 లేదా 18 తేదీల్లో జరగబోయే కూటమి మొదటి బహిరంగసభలో నరేంద్రమోడి పాల్గొంటున్నారు.
తన ప్రసంగంలో మోడీ జనాలకు ఏమి చెబుతారు ? ఏపీకి ఏమి హామీలిస్తారు ? అప్పట్లో మూడుపార్టీలు కలిసి ఇచ్చిన హామీలనే తుంగలో తొక్కేశారు. అలాంటిది మళ్ళీ ఇపుడు ఇచ్చే హామీలను జనాలు నమ్ముతారా ? అసలు మోడీని నమ్ముకుంటే టీడీపీ, జనసేనకు జనాలు ఓట్లేస్తారా ? బీజేపీ మీదున్న మంటనంతా జనాలు టీడీపీ, జనసేన మీద చూపితే అప్పుడేమవుతుంది ?