ఉత్తరాంధ్ర : ఈ నేత ఎటూకాకుండా అయిపోతారా ?
రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలుండవనే నానుడి చాలా పాపులర్. నేతలు తాము తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ‘ఉన్నదీ పోయింది’.. అనే ముతక సామెతలో చెప్పినట్లుగా అయిపోతారు. ఇపుడిదంతా ఎందుకంటే వైజాగ్ సిటిలోని వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ గురించే. వైసీపీలో ఎంఎల్సీగా ఉన్న వంశీ సడెన్ గా పార్టీకి రాజీనామాచేసి జనసేనలో చేరారు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయటం కోసమని చెప్పారు. వైసీపీలో ఉంటే టికెట్ రాదు కాబట్టే జనసేనలో చేరి పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు.
సీన్ కట్ చేస్తే ఇపుడు ఎంఎల్సీగా వంశీపై అనర్హత వేటుపడి మాజీ అయిపోయారు. ఇదే సమయంలో పోటీచేసే విషయంలో వంశీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పక్కనపెట్టేశారట. విషయం ఏమిటంటే పార్టీ ఫిరాయించిన వంశీపై అనర్హత వేటు వేయాలని శాసనమండలిలో పార్టీ చీఫ్ విప్ మేరుగ మురళీకృష్ణ మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదుచేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఛైర్మన్ వంశీపై అనర్హత వేటువేశారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్ళున్నా అనర్హతవేటు పడటంతో వంశీ మాజీ అయిపోయారు.
ఇదే సమయంలో విశాఖ తూర్పునుండి గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన మూడోసారి పోటీచేయాలనే జనసేనలో చేరారు. అయితే టీడీపీ హ్యాట్రిక్ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణకే చంద్రబాబునాయుడు టికెట్ ప్రకటించటంతో ఇక్కడ వంశీకి అవకాశం లేకుండాపోయింది. అయినా పర్వాలేదని విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుండి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే పార్టీ నిర్వహించిన సర్వేలో వంశీకి నెగిటివ్ వచ్చిందట. ప్రస్తుతానికి అభ్యర్ధిగా పనిచేసుకోమని చెప్పినా బీఫారం ఇచ్చేంతవరకు అనుమానమే అనంటున్నారు. పోని భీమిలీ నియోజకవర్గంలో అన్నా టికెట్ ఇవ్వమంటే కుదరదని చెప్పేశారట.
పోటీచేయాలనే కోరికతో వైసీపీని వదిలేసి జనసేనలో చేరిన వంశీ పరిస్ధితి చివరకు ఇలాగైపోయింది. దాదాపు నాలుగేళ్ళ ఎంఎల్సీ పదవిపోయింది. జనసేనలో టికెట్టూ దక్కేఅవకాశంలేదని తేలిపోయింది. మరిపుడు వంశీ ఏమిచేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. టికెట్ ఇవ్వని జనసేనలో కంటిన్యు అవలేక అలాగని తనపై అనర్హత వేటు వేసిన వైసీపీలోకి తిరిగి వెళ్ళలేక వంశీ నానా అవస్తలు పడుతున్నారు. మొత్తానికి ఈ నేత పరిస్ధితి ఎటూ కాకుండా అయిపోయింది.