ఏపీ: ఏ కులాలు ఎవరి వైపు.. గత ఎన్నికల లెస్సన్ ఏంటి..!
గత ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో అత్యధికంగా గెలిచింది రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 48 మంది రెడ్లు గెలిచారు. ఉమ్మడి అనంతపురంలోని ఉరవకొండ నుంచి పోటీ చేసిన విశ్వేశ్వర్రెడ్డి తప్ప అందరూ విజయం సాధించారు. ఇక్కడ మరో చిత్రం ఏంటంటే అందరూ వైసీపీ నుంచి గెలిచిన వారే కావడం. టీడీపీ నుంచి ఒక్క రెడ్డి సామాజికవర్గం నేత కూడా గెలుపు గుర్రం ఎక్కలేదు. టీడీపీకి గత 40 ఏళ్లలో రెడ్డి ఎమ్మెల్యే లేకపోవడం ఇదే తొలిసారి. రాయలసీమ నుంచి 31 మంది, కోస్తా జిల్లాల నుంచి 17 మంది గత ఎన్నికల్లో రెడ్డి నాయకులు విజయం సాధించారు.
బీసీల్లోనూ వైసీపీదే పైచేయి...
బీసీలు తమకు వెన్నెముకలని భావించే టీడీపీకి.. ఆ వర్గాలు కూడా గత ఎన్నికల్లో ఝలక్ ఇచ్చాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన 17 మంది అసెంబ్లీకి ఎన్నికవ్వగా... వీరిలో వైసీపీకి చెందిన వారు ఆరుగు రు ఉండగా.. టీడీపీకి చెందిన 11మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం బీసీలు 34 మంది ఎన్నికవ్వగా... వైసీపీ నుంచి 28 మంది టీడీపీ నుంచి ఆరుగురు బలహీనవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. పొలినాటి వెలమ నుంచి నలుగురు, కొప్పుల వెలమ నుంచి ఐదుగురు ఎన్నికయ్యారు.
తూర్పు కాపు సామాజాకి వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలయ్యారు. కళింగ వర్గం నుంచి ఇద్దరు, నలుగురు యాదవ్లు, ముగ్గురు గౌడ్లు, ముగ్గురు మత్స్యకారులు, రెడ్డిక ఒకరు, శెట్టిబలిజ ఒకరు, గవర నుంచి ఒకరు, రజక, బోయ, లింగాయత్ నుంచి ఒక్కొక్కరు గెలిచారు. కురుబ సామాజికవర్గం నుంచి ఇద్దరు విజయం సాధించారు.
వీరు కూడా అటువైపే..
రాష్ట్రవ్యాప్తంగా 25 మంది కాపులు గెలుపొందగా.. వారిలో అత్యధికంగా 22 మంది వైసీపీ తరపున గెలుపు గుర్రం ఎక్కడం గమనార్హం. ఇక ముగ్గురు టీడీపీ తరపున విజయం సాధించారు. ఇక ఎస్సీలు, ఎస్టీలు పూర్తిగా జగన్ పక్షానే నిలిచారు. మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే...గంపగుత్తగా 27 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచే గెలిపొందారు. టీడీపీకి, జనసేనకు చెరో ఒక్కస్థానం దక్కాయి.(కొండపి, రాజోలు). ఇక ఎస్టీ స్థానాలు మొత్తం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మొత్తం ఏడు నియోజకవర్గాలను జగన్ స్వీప్ చేశారు. అలాగే టికెట్ ఇచ్చిన నలుగురు ముస్లింలు సైతం వైసీపీ నుంచే గెలిచారు.