ఏపీ: రూటు మార్చిన జనసేన.. జేడీఎస్ తరహాలో రాజకీయాలు ఫలించేనా...?
2014లో ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన చీఫ్ పవన్ మద్దతు పలికారు. అయితే 2019లో ఆ రెండు పార్టీల కూటమికి వీడ్కోలు పలికి ఆయన వేరుగా పోటీకి దిగారు. కేవలం ఒక స్థానంలో మాత్రమే జనసేన గెలిచింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఓట్లు గణనీయంగా చీలడంతో అది వైసీపీకి బాగా లాభించింది. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో జట్టు కడితేనే తాము నెగ్గుకు రాగలమన్న సత్యాన్ని పవన్ గ్రహించారు. బీజేపీని, టీడీపీ ఒప్పించి కూటమి ఏర్పాటయ్యేందుకు కృషి చేశారు. తొలుత 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయడానికి అంతా రంగం సిద్ధమైంది. ఆ తర్వాత పరిణామాలతో 3 అసెంబ్లీ సీట్లను, ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి జనసేన త్యాగం చేసింది. జనసేన తరుపున ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను పవన్ ప్రకటించారు. వారిలో 9 మంది కాపు సామాజిక తరగతికి చెందిన వారు ఉన్నారు. మూడు ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ జనసేన బరిలోకి దిగుతోంది. బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, గవర సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరిని జనసేన బరిలోకి దింపింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 6, విశాఖ జిల్లాలో 4 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. ఈ జిల్లాలో కాపు సామాజికవర్గం అధికంగా ఉంది. పవన్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు వారి నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. దీంతో ఈ మూడు జిల్లాల్లో జనసేన బరిలోకి దిగి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించాలని భావిస్తోంది.