ఉత్తరాంధ్ర: విశాఖ పార్లమెంటు పరిధిలోని కీలక నియోజకవర్గం అయిన ఎస్.కోట. అరకు ఏజెన్సీకి ముఖద్వారమైన ఎస్.కోట రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన నియోజకవర్గం. ఒకవైపు ఏజెన్సీ.. మరోవైపు కొత్తవలస పారిశ్రామిక ప్రాంతం.. ఇంకోవైపు పచ్చటి పొలాలతో చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఎస్.కోట నియోజకవర్గం. కానీ, ఇక్కడ రాజకీయం మాత్రం అగ్ని గుండంలా మండుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండింటిలో కూడా గ్రూప్ వార్ పతాకస్థాయిలో ఉంది.ఎస్.కోట టీడీపీకి కంచుకోట. టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది. మిగిలిన అన్నిసార్లు పసుపు జెండా ఎగిరింది. అపజయమే లేకుండా వంద శాతం సక్సెస్ రేట్తో దూకుడుచూపించిన టీడీపీకి గత ఎన్నికల్లో కళ్లెం వేసింది వైసీపీ. ఈ నియోజకవర్గంపై మంత్రి బొత్స, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఓటమి చూసింది. ఈమె గతంలో ఎస్.కోట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఆమె తాత మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు.
ఐతే ఊహించని విధంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమెకు సొంత పార్టీ పోరు ఎక్కువైంది. ఎందుకంటే కోళ్ల కుటుంబం పవర్ ని తట్టుకోలేని కొంతమంది నేతలు.. ఎన్ఆర్ఐ గొంప కృష్ణను రాజకీయంగా ప్రోత్సహించడంతో టీడీపీలో స్పెషల్ గ్రూపు తయారైంది. మొదట్లో ఈ గ్రూప్ను లైట్గా తీసుకున్న లలితకుమారి.. చివరికి తన సీటుకే ఎసరు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. చివరికి ఎలాగోలా టికెట్ దక్కించుకున్నా.. ఇప్పుడు రెండో గ్రూప్ నుంచి సహాయ నిరాకరణ ఫేస్ చేస్తున్నారు.తనకే సీటివ్వాలని లేదంటే.. ఇండిపెండింట్గా పోటీ చేస్తానని హెచ్చరిస్తున్న గొంప కృష్ణ.. ఎస్.కోట టీడీపీని వణికిస్తున్నారు. ఐతే ఈ వ్యవహారంపై ఆచితూచి అడుగులేస్తున్న లలితకుమారి.. పోలింగ్ కి అంతా సర్దుకుంటుందనే భావనతో ప్రత్యర్థివర్గాన్ని శాంతింపజేసే కార్యక్రమంలో ఉన్నారు.
ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలీదు గాని… ప్రస్తుతం టీడీపీలో అంతర్గత రాజకీయాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.వైసీపీని కూడా సేమ్ సమస్య వెంటాడుతోంది. దీంతో ఎస్.కోటలో రెండు పార్టీల పరిస్థితి సేమ్ టూ సేమ్గా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే మరోసారి టికెట్ ఇచ్చింది వైసీపీ. గజపతినగరం నియోజకవర్గానికి చెందిన కడుబండిని గత ఎన్నికల సమయంలో ఎస్.కోటలో పోటీకి పెట్టింది. ఈ నియోజకవర్గంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల.. గజపతినగరం నుంచి కడుబండిని తీసుకువచ్చి సోషల్ ఇంజినీరింగ్తో ఎస్.కోటలో గెలిచింది వైసీపీ..ప్రస్తుతం అదే వ్యూహం అనుసరిస్తోంది.