కాపుల కోసం.. కాపుల చేత.. ' వంగవీటి రంగా ' సెన్షేషనల్ లైఫ్
- మహానాడుకు పోటీగా కాపునాడుతో తిరుగులేని సక్సెస్
- సమైక్య రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం దిశగా బలమైన పునాదులు
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో వంగవీటి రంగా పేరు తెలియని వారు లేరు. అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు.. ఈయ న పేరు మార్మోగిపోతుంది. కేవలం వంగవీటి.. అన్న నాలుగు అక్షరాలు.. ఆయన మరణించి మూడు దశాబ్దాలు దాటిపోయినా.. ఇప్పటికీ ప్రజల నాలుకలపై తచ్చాడుతూనే ఉంటాయి. దీనికి కారణం.. ఆయన పేదల పక్షపాతిగా నిలిచిపోవడమే. ముఖ్యంగా కాపులకు కూడా గుర్తింపు రావాలని.. కాపులకు కూడా రాజ్యాధికారం కావాలని.. తపించిన నాయకుడు.
ఆదిలో వంగవీటి కుటుంబం కమ్యూనిస్టు పార్టీలో ఉండేది. కాకాని వెంకటరత్నంతో కలిసి ముందుకు సాగారు. తర్వాత.. కాంగ్రెస్లోకి చేరింది. దీని వెనుక అనేక కీలక పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ప్రారంభమైన తొలినాళ్లలో ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా రంగా గళం వినిపించారు. అప్పటి వరకు రాష్ట్రంలో బ్రాహ్మణ-రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యం రాజకీ యాలను శాసించింది. ఎన్టీఆర్ ఎంట్రీతో కమ్మల ఆధిపత్యం ప్రారంభమైంది.
ఈ క్రమంలో విజయవాడలో దేవినేని నెహ్రూ కుటుంబం.. టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తే.. కాపు సామాజిక వర్గం నాయకుడిగా అప్పటికే గుర్తింపుపొందిన రంగా.. కాంగ్రెస్లో చేరి.. కాపులు, పేదలను అజెండాగా తీసుకుని ముందుకు సాగారు. ఇలా.. రంగా రాజకీయాలు.. కాపులకే కాకుండా.. పేదలకు సెంట్రిక్గా మారింది. ఇదే సమయంలో రాజకీయాల్లో కమ్మ వర్గాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఆయన ప్రయత్నించా రు. ఈ క్రమంలోనే అన్నగారు ఎన్టీఆర్ మహానాడు నిర్వహిస్తే.. దీనికి పోటీగా రంగా కాపు నాడు పెట్టి విజయవంతం చేసి.. కాపులకు రాజ్యాధికారం కావాలని గళం వినిపించారు.
ఇలా.. తొలిసారి కాపుల కోసం.. కాపుల చేత.. వంగవీటి విప్పిన గళం రాష్ట్రంలో 1975-85 మధ్య ఒక దశాబ్దం పాటు కాపులకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఉద్యమాలతోనే రంగా జాతీయ స్థాయి లో గుర్తింపు పొందారు. ఇక, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా రంగా పేరు మార్మోగింది. నిస్వార్థంగా ఆయన కాపుల కోసం పనిచేశారనడంలో ఎలాంటి సందేహం లేదు.
అంతేకాదు.. పేదల కోసం.. వారి జీవితాలు బాగు చేయడం కోసం కూడా.. అప్పటి విజయవాడ తూర్పు (ఇప్పుడు సెంట్రల్) నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన నిరంతరం కృషి చేశారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా రాధా ఉన్నారు. అయితే.. తండ్రి స్థాయిలో ఆయన లేరనే విమర్శలు కాపు వర్గాల్లోనే వినిపిస్తుండడం గమనార్హం.