ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి అనేక పాట్లు పడుతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా వాడ వాడ వడపోస్తున్నారు. గెలుపు కోసం ఓటర్ల కాళ్లు కూడా పట్టుకుంటున్నారు. ఈ విధంగా ఏపీలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలలో నాయకులు ప్రచారంలో ఉంటే గుంటూరులో మాత్రం కాస్త వెరైటీగా ప్రచారం సాగుతోంది. వార్ వన్ సైడే అన్నట్టు తెలుస్తోంది. మరి గుంటూరులో ఎంపీ స్థానం ఆ నేతకు అస్సలు నచ్చలేదట. తాను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పకనే చెబుతున్నాడట. ఇంతకీ ఆ నేత ఎవరు.? గుంటూరు జిల్లాపై జెండా ఎగరేసేది ఎవరు.? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ కళ్ళల్లో కారం కొడుతోంది. ఎంపీ అభ్యర్థులుగా ఖరారు చేసిన వారంతా అలిగి కూర్చుంటున్నారట. ప్రస్తుతం గుంటూరు వైసిపి నుంచి కిలారు వెంకట రోశయ్య ఎంపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. టిడిపి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ కు సీటు ఖరారు చేశారు. ఇదే తరుణంలో పెమ్మసాని ఇప్పటికే జిల్లా మొత్తం ఒకసారి ప్రచారం పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కానీ కిలారు వెంకట రోశయ్య జగన్ పై అలిగి కనీసం ప్రచారం కూడా వెళ్లడం లేదట. దీనికి ప్రధాన కారణం తనకు పొన్నూరు ఎమ్మెల్యే సీటు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కిలారు వెంకట రోశయ్య ప్రచారం కూడా వెళ్లడం లేదట. దీన్ని బట్టి చూస్తే మాత్రం గుంటూరు ఎంపి స్థానంపై వైసిపి అంతగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. టిడిపి నుంచి వచ్చిన పెమ్మసాని విజయం ఖరారు అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు, వైసీపీలో ఉన్న గొడవ పెమ్మసాని కి కలిసి వస్తుందని అంటున్నారు.