బీజేపీ జోరు.. దూసుకుపోతున్న ముగ్గురు అభ్యర్థులు?
ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే గెలుపు గుర్రాలను బలిలోకి దింపగా.. మిగతా పార్టీల అభ్యర్థులతో పోల్చి చూస్తే బిజెపి అభ్యర్థులందరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరీ ముఖ్యంగా ముగ్గురు ఎంపీ అభ్యర్థులు అయితే మరింత దూకుడు పెంచి తగ్గేదేలే అనేస్తున్నారు.
సికింద్రాబాద్ : ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ కావడంతో.. ఇక ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఫై ఆయనకు మంచి పట్టు ఉంది. దీనికి తోడు తన అసెంబ్లీ నియోజకవర్గమైన అంబర్పేట కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లో కలుస్తూ ఉండడంతో తన పాత పరిచయాలను వినియోగించుకోవాలని అనుకున్నారట కిషన్ రెడ్డి.
మల్కాజ్గిరి : ఇండియాలోని అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ గా పేరు సంపాదించుకున్న మల్కాజ్గిరిలో గెలుపే లక్ష్యంగా ఈటెల ప్రచార జోరు పెంచారు. కార్నర్ మీటింగులు, స్థానిక సంఘాలు, కుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కార్యకర్తల సమావేశాల గురించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇక మరోవైపు ఇఫ్తార్ విందులో కూడా పాల్గొంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
హైదరాబాద్ : ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బిజెపి మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి మాధవి లతను అభ్యర్థిగా ప్రకటించింది. లతా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఎన్నో సేవ, ఆరోగ్య, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పట్టు సాధించింది మాధవి లత. ఇప్పటికే చంద్రయాన్ గుట్ట, యాకుత్పురా, చార్మినార్, గోషామహల్ కార్వాన్, మలక్పేట నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నారు. మహిళా సంఘాలు, వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి ఇప్పటికే మద్దతును కూడగట్టుకున్నారు. ఎంఐఎం పార్టీ హయాంలో అభివృద్ధి జరగలేదని.. పేద ముస్లింలకు అన్యాయం జరిగిందని ప్రచారం చేస్తూ ఇక ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గతంతో పోల్చి చూస్తే బిజెపి, మజిలీస్ మధ్య ఈసారి గట్టి పోటీ ఉంది అని చెప్పాలి.