40 ఇయర్స్ ఇండస్ట్రీని బుట్టలో పడేసిన 12 ఇయర్స్ ఇండస్ట్రీ.. !
- జగన్ గేలానికి చిక్కేసిన చంద్రబాబు..
- జగన్ విశ్వసనీయత ముందు తేలిపోతోన్న బాబు..!
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
రాజకీయాల్లో వ్యూహాలు ఉండాలి. దూర దృష్టికూడా ఉండాలి. ప్రత్యర్థులకు చిక్కని విధంగా రాజకీయాలు చేయాలి. ఎక్కడా తొణుకు, బెణుకు లేకుండా రాజకీయాలు సాగించాలి. ఇదీ.. అత్యంత కీలకం. అత్యంత ప్రధానం. దీనికే ప్రజలు ఓటెత్తుతారు. విశ్వసిస్తారు. కానీ, ఏపీలో జరుగుతున్న రాజకీయాలు గమనిస్తే.. చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే టీడీపీ చంద్రబాబును 12 ఏళ్ల అనుభవం మాత్రమే ఉన్న వైసీపీ అధినేత జగన్ బుట్టలో పడేశారనే వాదన వినిపిస్తోంది.
జగన్ చెబుతున్న దానిని బట్టి.. విశ్వసనీయతే.. ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు వస్తుంది. ఏదైనా ప్రజలకు నాయకుడిని కనెక్ట్ చేసేది కూడా ఇదే. ఈ విషయంలో జగన్ ముందు చంద్రబాబు తేలిపోతున్నారు. అదే సమయంలో తన వలలోకి జగన్ పడేలా వ్యూహరచన చేయాల్సిన చంద్రబాబు.. నేరుగా పోయి.. జగన్ వలకే చిక్కుకుపోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలను గమనిస్తే.. తాము అధికారంలోకి వచ్చాక.. అమ్మ ఒడి, మహిళలకు డబ్బులు.. వంటి ప్రస్తుత పథకాలను కొనసాగిస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.
అమ్మ ఒడి పేరును అమ్మకు వందనంగా మార్చి చంద్రబాబు ప్రచారంలో దంచికొడుతున్నారు. పైకి ఇది ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలోమాత్రం చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే.. జగన్ ను నిలువె త్తు విమర్శలతో కడిగేస్తున్న చంద్రబాబు.. ఆయన పాలనను తిప్పికొట్టాలని పిలుపునిస్తున్న చంద్రబాబు .. తాము అధికారంలోకి వస్తే మాత్రం జగన్ అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని అంటున్నారు. వీటిలో కేవలం అమ్మ ఒడి మాత్రమే కాదు.. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు కూడా ఉండడం గమనార్హం.
దీనిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదే. పైగా జగన్ పెట్టిన పథకాలు కొనసాగించడమేంటనే చర్చ కూడా సాగుతోంది. ఇక, ఇదే సమయంలో జగన్ ఎక్కడా చంద్రబాబు వలలో చిక్కుకోవడం లేదు. టీడీపీ గతంలో పెట్టిన పథకాలను తాము కొనసాగిస్తామని కానీ... తిరిగి వాటిని తీసుకువస్తామని కానీ.. జగన్ ఎక్కడా చెప్పడం లేదు. గత టీడీపీ హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలను కానీ, అన్న క్యాంటీన్లను కానీ.. ఎక్కడా ప్రస్తావించడం లేదు. అంటే.. జగన్ ఎక్కడా చంద్రబాబు ను ఇమిటేట్ చేయడం కానీ.. ఆయన పథకాలను కాపీ కొట్టడం కానీ.. చేయడం లేదు. ఇదే.. ఇప్పుడు ఓటు బ్యాంకును సంపూర్ణంగా ప్ర
భావితం చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.