వాల్తేరు క్లబ్పై వైసీపీలో చిచ్చు.. బొత్స, విజయసాయి పోటాపోటీ వ్యాఖ్యలు..?
విశాఖ నగరం నడిబొడ్డున కీలకమైన ప్రాంతంలో వాల్తేరు క్లబ్ ఉంది. ఈ ప్రైవేట్ క్లబ్లో విశాఖకు చెందిన 2000ల మంది వరకు సభ్యులు ఉన్నారు. దీని సభ్యత్వానికి రూ.50 లక్షలు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దాదాపు 32 ఎకరాల భూమిలో ఇది విస్తరించి ఉంది. దీని భూమిపై అందరి కన్ను పడింది. గతంలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి దీనిలో సభ్యత్వానికి ప్రయత్నించారు. అయితే ఆయనకు సభ్యత్వం ఇవ్వలేదు. దీంతో ఆ అక్కసుతోనే వాల్తేరు క్లబ్ భూములను స్వాధీనం చేసుకోవడానికి విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే విజయసాయిరెడ్డి వాదన ప్రకారం ఇది ప్రభుత్వ భూమి అని, దీనిని కొందరు లీజుకు తీసుకున్నారని చెబుతున్నారు. అయితే ఆ లీజు ముగిసిందని అన్నారు. అందువల్లే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. దీనిపై గతంలో సిట్కు ఫిర్యాదు చేయడం, వాల్తేరు క్లబ్ హైకోర్టుకు వెళ్లి సిట్ ఉత్తర్వులపై స్టే తెచ్చుకోవడం జరిగాయి. విశాఖపట్నంలో అత్యంత ధనవంతులు సభ్యులుగా ఉండే ఈ క్లబ్ విషయంలో విజయసాయి రెడ్డి జోక్యం వల్ల వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తాయని అంతా భావిస్తున్నారు. దీంతో బొత్స సత్యనారాయణ దిద్దుబాటు చర్యలకు దిగారు.