ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం..?
ఓటుకు నోటు కుంభకోణం కేసు 2015లో జరిగింది. మే 31, 2015న ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ సంప్రదించింది. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్రెడ్డికి మద్దతిస్తే రూ.5 కోట్లు ఇస్తామని బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముందుగా స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏసీబీ వలపన్ని టీడీపీలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డిని పట్టుకుంది. ఆయనతో పాటు మరికొందరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. అనంతరం వారందరికీ బెయిల్ మంజూరైంది. ఆడియో/వీడియో రికార్డింగ్ల రూపంలో నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించామని, అడ్వాన్స్గా రూ. 50 లక్షలను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి సీఎం అయ్యారు. ఇక ఈ కేసులో అప్పటి సీఎం చంద్రబాబు స్టీఫెన్ సన్తో ఫోన్లో సంభాషించినట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. దీనిపై రేవంత్ వాదన మరోలా ఉంది. ఈ కేసును విచారించే అర్హత ఏసీబీకి లేదని ఆయన వాదించారు. దీనిపై కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు. అయితే ఈ కేసు విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ వెలువడే నిర్ణయం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ ఏర్పడింది.