ఇదెక్కడి విడ్డురం.. అక్కడ జీరో పోలింగ్.. ఒక్కరు కూడా ఓటెయ్యలేదు?
అయితే ఈ మధ్యకాలంలో ఓటు వేసేందుకు ఎవరు పెద్దగా ఆసక్తిని కనపరచడం లేదు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఓటు వేయడం బాధ్యత అని తెలిసినప్పటికీ పోలింగ్ కేంద్రం వరకు వెళ్లి అక్కడ లైన్ లో వెయిట్ చేసి ఏం ఓటు వేస్తాంలే అన్న విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకుల తీరు నచ్చక ఓటు హక్కు వినియోగించుకోవడానికి దూరంగానే ఉంటున్నారు అని చెప్పాలి. అయితే ఇలా చాలామంది ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో చాలా చోట్ల ఇక తక్కువ పోలింగ్ నమోదవడం చూస్తూ ఉంటాం.
కానీ ఇక్కడ మాత్రం తక్కువ పోలింగ్ నమోదు అవ్వడం కాదు అసలు పోలింగ్ నమోదు కానే లేదు. నాగాలాండ్ లో ఒకే ఒక లోక్సభ స్థానానికి నిన్న పోలింగ్ జరిగింది. అయితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో 6 జిల్లాల్లో ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. దీంతో జీరో ఓటింగ్ నమోదయింది. నాగాలాండ్ నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈ ఆరు జిల్లాల ప్రజలను ఓటింగ్ కి దూరంగా ఉండాలి అంటూ పిలుపునిచ్చింది. దీంతో నాలుగు లక్షల ఓటర్లు ఉన్న ఈ జిల్లాలలో ఏ ఒక్కరు కూడా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో జీరో ఓటింగ్ నమోదు కావడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.