పెద్దపల్లి కింగ్ ఎవరు... ముక్కోణపు పోటీలో విన్నర్ ఎవరంటే..?
ఇక్కడ కాకలుతీరిన రాజకీయ యోధుడు గడ్డం వెంకటస్వామికి ఇది అడ్డా. ఇక్కడి ప్రజలంతా వెంకటస్వామిని కాకా అని ముద్దుగా పిలుచుకుంటారు. తండ్రి తరువాత కొడుకు డాక్టర్ వివేక్ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయన కుమారుడు వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి పరిదిలో ఏడు నియోజకవర్గాల్లో గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ఇక చెన్నూరు, బెల్లంపల్లి నుంచి వంశీకృష్ణ పెద్దనాన్న గడ్డం వినోధ్, వివేక్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వంశీకృష్ణ తాత కాక కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కాకాకు ఇప్పటి ఈ నియోజకవర్గంలో మంచి పేరుంది.
తాతకు ఉన్న పేరు, పెద్దనాన్న, తండ్రి ఆశిస్సులతో వంశీకృష్ణ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగిన విధంగా తన ప్రచారం ముమ్మరం చేసి దూసుకుపోతున్నారు. ఇక ఈ స్థానంలో బీ ఆర్ ఎస్ కూడా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీ అభ్యర్తులు గెలిచారు. బాల్క సుమన్, బొర్లకుంట వెంకటేశ్ నేత గెలుపొందారు. ఇప్పుడు మాజీ మంత్రి. పార్టీ సీనియర్ నేత. ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం, ధర్మపురి నియోజకవర్గాల నుంచి విజయ బావుటా ఎగురవేసిన కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. కేసీఆర్ కొప్పుల ఈశ్వర్కు మొదటి విడతలోనే టికెట్ ప్రకటించారు.
సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక మందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరికీ సుపరిచితుడు. ఈ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకంగా మారనుండడంతో పార్టీ కొప్పుల ఈశ్వర్ను రంగంలోకి దింపింది. మంత్రిగా పనిచేసిన అనుభవం, సింగరేణి కార్మికుడిగా ఉన్న పరిచయాలతో పాటు సౌమ్యుడిగా ప్రజల్లో మంచిపేరుంది. ఇది కొప్పుల ఈశ్వర్కు రాజకీయంగా కలిసొచ్చే ఆంశంగా చెప్పవచ్చు. ఇక బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. గతంలో ఇతడు కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ లో పనిచేశాడు.
నేతకాని సామాజిక వర్గానికి చెందిన గొమాసే శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్ రాదని భావించి బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన మూడు రోజులకే ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇదే నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ పోటీ చేసి 49,031 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జి వివేక్ చేతిలో శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల తర్వాత 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. ఇప్పుడు బీజేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు శ్రీనివాస్. ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న మానియాను తనకు అవకాశంగా మలుచుకోవాలని భావిస్తున్నాడు శ్రీనివాస్. ఈ ముక్కోణపు పోటీలో పెద్దపల్లి గద్దెనెక్కెదవరో కొద్ది రోజుల్లో తేలిపోనున్నది.