తెలుగు రాష్ట్రాల్లో ఆ క్రెడిట్ మాత్రం జగన్కే సొంతం?
వైసీపీ నుంచి బరిలో సామాన్యులు
ఎక్కువ సంఖ్యలో ఛాన్స్ ఇచ్చిన జగన్
రాజకీయాలు కోటీశ్వరుల వ్యాపకంగా మారిన రోజులివి. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కోట్ల రూపాయల వ్యవహారంగా మారిపోయింది. అందుకే పార్టీలు కూడా ఎన్నికల్లో ఘనంగా ఖర్చు చేయగలవారికోసమే వెదుకుతున్నాయి. అలాంటి వారికే టికెట్లు కట్టబెడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం ధనవంతులకే పరిమితమవుతోంది. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో సామాన్యులకూ చట్టసభల్లో కూర్చునే అవకాశం ఇస్తున్న పార్టీల్లో వైసీపీ ముందువరుసలో ఉంటోంది.
ఇందుకు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏపీ మంత్రిగా ఉన్న విడదల రజిని.. ఓ సామాన్య బీసీ మహిళ. ఆమెను జగన్ గుర్తించి చిలకలూరి పేట టికెట్ ఇచ్చారు. అసెంబ్లీకి ఎన్నికైన ఆమెను ఆ తర్వాత జగన్ మంత్రిని కూడా చేశారు. అలాగే నందిగం సురేష్ కూడా.. అతి సామాన్యుడైన యువ నాయకుడిని సీఎం జగన్ ఏకంగా పార్లమెంటుకు పంపారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి కూడా అంతే. ఓ ఫిజీషియన్ అయిన ఆయన్ను సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చి తిరుపతి నుంచి గెలిపించుకుని ఢిల్లీకి పంపారు.
అనకాపల్లి సిట్టింగ్ బీశెట్టి సత్యవతి పరిస్థితీ అంతే. ఆమే ఓ సామాన్యురాలే. మరో ఎంపీ బొడ్డేటి మాధవి కూడా చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎంపీ అయ్యారు. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్షి కూడా మరో ఉదాహరణగా నిలుస్తారు. ఇవన్నీ 2019లో జగన్ చేసిన రాజకీయ ప్రయోగాలు. అవి బాగా విజయవంతం అయ్యాయి. సామాన్యులకూ జగన్ పట్టం కడతాడని నిరూపించాయి.
ఇక ఈసారి కూడా జగన్ అదే పంథా కొంత వరకూ కొనసాగించారనే చెప్పుకోవాలి. ఈసారి కూడా జగన్ టికెట్ ఇచ్చిన వారిలో అనేక మంది సామాన్యులు ఉన్నారు. మైలవరంలో తిరుపతిరావు యాదవ్, కనిగిరిలో గద్దాల నారాయణరావు యాదవ్, విజయవాడ వెస్ట్లో షేక్ కాశిప్, శింగనమలలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు.. ఇలా కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తాయి. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇలా పెద్ద సంఖ్యలో సామాన్యులకు పట్టం కట్టిన క్రెడిట్ మాత్రం జగన్దేనని చెప్పుకోవచ్చు.