ఇన్ని కష్టాల మధ్యలో పురందేశ్వరి గెలిచి కేంద్ర మంత్రి అయ్యేనా..?
- హ్యాట్రిక్ ఓటమి వస్తే పొలిటికల్ కెరీర్కు ఎండ్ కార్డే..?
- బీసీ అస్త్రం నమ్ముకున్న వైసీపీ...
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందరేశ్వరి రాజకీయంగా మళ్లీ ఒక వెలుగు వెలిగే ఛాన్స్ ఉంటుందా..? లేదా..? అన్నది ఈ ఎన్నికలతో తేలిపోనుంది. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి బాపట్లలో, 2009లో విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా 10 ఏళ్ల పాటు ఆమె చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపిలోకి వెళ్లిన పురందరేశ్వరి.. 2014లో రాజంపేట నుంచి, 2019లో విశాఖపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి పొత్తులో భాగంగా ఆమె తనకు అత్యంత సురక్షితంగా భావించే రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని ఎంచుకున్నారు. ఈ ఎన్నికలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరికి చావో.. రేవో.. లాంటివి. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లోను ఆమె వరుసగా ఓడిపోతూ వస్తున్నారు.
పేరుకు మాత్రమే ఆమె బీజేపిలో ఉన్నా పదేళ్లలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీ పగ్గాలు ఆమెకు ఇవ్వడం కాస్తంత ఊరాట. టికెట్లు కేటాయింపులను పురందేశ్వరి సమతూకం పాటించలేదని.. తన సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇది పక్కన పెడితే రాజమండ్రిలో గెలుపు ఆమెకు కీలకం కానుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే పురందరేశ్వరి పొలిటికల్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. రాజమండ్రిలో గెలిస్తే మాత్రం.. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
పురందేశ్వరి రాజమండ్రిలో గెలుస్తుందా అంటే ? అంత ఈజీగా బయటపడే పరిస్థితి లేదు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కొవ్వూరు, గోపాలపురంలో టీడీపీకి... నిడదవోలులో జనసేనకు ఆధిక్యత కనిపిస్తోంది. అయితే గోదావరికి అటువైపు ఉన్న నాలుగు సెగ్మెంట్లు కూటమి అభ్యర్థులకు అంత ఈజీగా కనపడటం లేదు. రాజానగరంలో గట్టి పోటీ ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి బొచ్చయ్య చౌదరి అంత యాక్టివ్గా పనిచేయటం లేదన్న చర్చలు నడుస్తున్నాయి. రాజమండ్రి సిటీలో ఎంపీ భరత్కు టీడీపీ వాసుకు గట్టి పోటీ నడుస్తోంది. అనపర్తి సీటు విషయంలో పెద్ద గందరగోళం నెలకొంది. ఇక్కడ వచ్చే మెజార్టీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసులను గెలిపిస్తుంది అన్న నమ్మకంతో వైసీపీ ఉంది.
పైగా వైసీపీ నుంచి బీసీల్లో బలమైన శెట్టిబలిజ వర్గానికి చెందిన.. ఇటు డాక్టర్ గా మంచి పేరున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీలో ఉండడంతో పార్లమెంటు పరిధిలో ఉన్న శెట్టిబలిజలతో పాటు బీసీ వర్గాలు తమ పార్టీకే ఓటు వేస్తాయన్న నమ్మకం వైసీపీలో గట్టిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కమలం సింబల్ కావడంతో పురందరేశ్వరికి క్రాస్ ఓటింగ్ భయం కూడా ఉంది. ఓటమి మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరిగే రాజమండ్రి సిటీ రూరల్, రాజానగరంలో కూటమి అభ్యర్థులు పై చేయి సాధిస్తే తప్ప.. పురందరేశ్వరి గెలిచే పరిస్థితి లేదు. మరి పురందరేశ్వరికి చావో.. రేవోగా మారిన ఎన్నికలలో ఆమె ఎలా ?గట్టు ఎక్కుతుంది అన్నది అయితే ప్రస్తుతానికి సస్పెన్సే.