పాలమూరు: జేజమ్మకు జేజేలు కొడతారా.?
•ఉద్దండులకే చెమటలు పట్టించిన జేజమ్మ..
•పాలమూరు ప్రజలు పట్టం కడతారా.?
ఒకప్పుడు మహిళలంటే వంట రూమ్ కే పరిమితమై ఉండేవారు. కానీ టెక్నాలజీ పెరిగిన కొలది పురుషులు మహిళలు అనే తారతమ్యాలు లేకుండా అన్ని రంగాల్లో మహిళలు కూడా రాణిస్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాల నుంచి రాజకీయంగా మహిళలు అరంగేట్రం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి మహిళ రాజకీయవేత్తల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మహిళా నాయకురాలు ధర్మవరపు కొట్టం అరుణ అలియాస్ డీకే అరుణ. ఈమె కుటుంబం పూర్తిగా రాజకీయ నేపథ్యం కలిగినదే. తల్లి గారి ఇంట్లో అందరూ రాజకీయవేత్తలే..ఇటు అత్తగారింట్లో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. డీకే అరుణ తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నక్సలైట్ల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా అరుణ భర్త భరత సింహారెడ్డి, భావ సమరసింహారెడ్డి గద్వాలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులే. ఆ విధంగానే డీకే అరుణ కూడా రాజకీయాల్లో రాణిస్తూ దూసుకుపోతోంది. అలాంటి ఈమె ఈసారి బీజేపీ నుంచి పార్లమెంటు బరిలో నిలిచింది. ఈ జేజమ్మ ఈసారి పాలమూరు, గద్వాల కోటపై జెండా పాతుతుందా. ఆమె రాజకీయ నేపథ్యం ఎలా సాగింది అనేది చూద్దాం..
డీకే అరుణ చిన్నతనం నుంచి రాజకీయాలను చూస్తూనే పెరిగారు. తన తండ్రి చిట్టం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే నక్సలైట్ల కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విధంగా తండ్రి నుంచి రాజకీయం నేర్చుకున్న డీకే అరుణ, మెట్టినింట్లో కూడా రాజకీయ నేపథ్యం ఉండడంతో భర్త, బావ రాజకీయాలను అందిపుచ్చుకొని తాజా రాజకీయాల్లో దూసుకుపోతోంది. డీకే అరుణ మొదటిసారిగా 2002లో కొల్లాపూర్ నుంచి జెడ్పిటిసిగా గెలిచింది. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉన్న డీకే అరుణ 2004లో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించింది. కానీ బీఆర్ఎస్ తో పొత్తులో భాగంగా టికెట్ నిరాకరించారు.
గెలుపోటములు:
డీకే అరుణ మొదటిసారిగా 1996లో మొదటిసారి మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి అప్పటి సీనియర్ నేత మల్లికార్జున్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఈమె 1999 లో గద్వాల శాసనసభ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టిడిపి నాయకుడు గట్టు భీముడు చేతిలో ఘోర పరాభవం పొందింది. అయినా పట్టువదలని డీకే అరుణ 2004లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం అందుకుంది. ఈ సమయంలో అప్పటి బలమైన అభ్యర్థి అయినటువంటి గట్టు భీములను ఎన్నికల్లో ఓడించింది. ఇక 2007లో మళ్లీ రాజశేఖర్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఈమె 2014లో గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ విధంగా పాలమూరు జిల్లా నుంచి మూడుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన డీకే అరుణ ప్రజలకి ఎంతో దగ్గరయింది. ఇక 2019 కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశించింది కానీ కాంగ్రెస్ స్పందించకపోవడంతో కాషాయ కండువా కప్పుకొని ఆ తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయింది. అలాంటి ఈమె ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి లోక్ సభ టికెట్ ని అందించింది. ఈసారైనా ఆమె పార్లమెంటులో ఎలాగైనా అడుగు పెట్టాలని గద్వాల కోటపై తన జెండా ఎగరవేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది.